మన తెలంగాణ/హైదరాబాద్ : ఉపాధి హామీ పథకం కింద గ్రామాల పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సర్పంచ్, ఉపసర్పంచ్ ఫోరం ప్రతినిధులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిందిగా ఫోరం ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సర్పంచ్లు, ఉపసర్పంచ్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజాప్రతినిధులుగా మీ బాధ్యతలను విస్మరించకుండా నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు బాగా సేవ చేసి మీతో పాటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం పంచాయతీలకు నిధుల సమస్య తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి నెలా రూ.339 కోట్లను విడుదల చేస్తోందన్నారు. ఈ నిధులతో పాటు పంచాయతీలు కూడా పెద్దఎత్తున సొంత నిధుల సమీకరించుకోవాలని సూచించారు. ఈ నిధులతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలన్నారు. అనంతరం సర్పంచ్, ఉపసర్పంచ్ల ఫోరం రూపొందించిన నూతన క్యాలెండర్ను ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఆవిష్కరించారు.