న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువాపై దేశద్రోహం కేసును సుప్రీం కోర్టు గురువారం కోట్టివేసింది. 1962 లో వచ్చిన ఉత్తర్వు ప్రతి జర్నలిస్టును ఇలాంటి ఆరోపణల నుండి రక్షిస్తుందని పేర్కొంది. గతేడాది ఢిల్లీలో జరిగిన అల్లర్లపై వినోద్ దువా తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. అయితే అందులో తప్పుడు కథనాలు ప్రసారం చేశారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేశారని ఆరోపిస్తూ హిమాచల్ ప్రదేశ్ బిజెపి నేత ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ వినోద్ దువా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం అతడిపై సత్వర చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించింది. తాజా విచారణ సందర్భంగా కేదార్ నాథ్ కేసును ప్రస్తావించిన న్యాయస్థానం ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టుకు రక్షణ పొందే హక్కు ఉందని పేర్కొంది. కేదార్ నాథ్ పరిగణలోకి తీసుకుంటే ఈ కేసు చెల్లదన్న జస్టిస్ యు.యు లలిత్, జస్టిస్ వినీత్ సరన్ ల ధర్మాసనం ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసింది.
SC cancelled sedition case against journalist Vinod Dua