Friday, April 19, 2024

బాగు’బడి’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన12 రకాల సదుపాయాలను ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేయడానికి ఈ పథకానికి శ్రీకారం ద్వారా చుట్టామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1200 పైచిలుకు పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే పనులన్నీ పూర్తి చేసుకున్న పాఠశాలలను అన్ని నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభిస్తామని చెప్పారు. ఏదైనా నియోజకవర్గంలో ప్రారంభానికి సిద్ధమైన పాఠశాలలు ఎక్కువ సంఖ్యలో ఉంటే కొన్నింటిని తర్వాత రోజుల్లో చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్‌లతో సమన్వయము చేసుకొని ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

కార్పొరేట్ స్థాయిలో సర్కారు బడులు

రాష్ట్రంలోని 26,055 స్కూళ్లను మూడేళ్లలో మూడు దశల్లో రూపురేఖలు మార్చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి సబిత తెలిపారు. మొదటి విడతలో 9,123 పాఠశాలలను రూ.3,497.62 కోట్లతో ఆధునికీకరిస్తున్నమని అన్నారు. ఏ పనిలో కూడా నాణ్యత విషయంలో రాజీ పడకుండా ప్రతి వస్తువును పది కాలాలపాటు ఉండేలా ప్రభుత్వం బ్రాండెడ్ వస్తువులను సమకూర్చుతున్నదని వెల్లడించారు. స్కూలు వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉంటే అంత బాగా చదువు అబ్బుతుందని ప్రభుత్వం భావించి కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

మన ఊరు – మన బడిలో పాఠశాలలను ప్రారంభిస్తున్న సందర్భంగా ఫిబ్రవరి ఒకటో తేదీన గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించాలని, అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీని, విద్యార్థుల తల్లిదండ్రులను, గ్రామ పెద్దలను భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News