ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
భారీ క్యూ లైన్తో ఇబ్బందులు ఎదుర్కొన్న పిల్లలు, మహిళలు
థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే స్టేషన్లోకి అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్: సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైలు సర్వీసులు ప్రారంభంకాగా సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి 9 రైళ్లు రాకపోకలు సాగించాయి. ఉదయం ఆరుగంటలకు నాంపల్లి నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఢిల్లీకి బయలుదేరింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకోవడంతో భారీ క్యూలైన్ ఏర్పడింది. ప్రయాణికులంతా రైలు బయలుదేరే సమయానికి 90 నిమిషాల ముందే రావాలని సూచించడంతో పెద్దసంఖ్యలో ప్రయాణికులు తెల్లవారుజాము నుంచే రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కళకళలాడింది. జనాలతో స్టేషన్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. థర్మల్ స్క్రీనింగ్ తర్వాత టికెట్ ఉన్న వారికే స్టేషన్లోకి అనుమతించారు. టెస్టులు చేసి స్టేషన్ లోపలికి పంపించడంతో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణికులు క్యూలైన్లో నిలబడ్డారు. క్యూ లైన్లో నిలబడడానికి పిల్లలు, స్త్రీలు ఇబ్బందులు పడ్డారు.
తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్లు ఇవే..
సికింద్రాబాద్, గుంటూరు (గోల్కొండ ఎక్స్ప్రెస్), హైదరాబాద్, న్యూఢిల్లీ (తెలంగాణ ఎక్స్ప్రెస్), హైదరాబాద్, విశాఖపట్నం (గోదావరి ఎక్స్ప్రెస్), హైదరాబాద్, ముంబై (హుస్సేన్సాగర్ ఎక్స్ప్రెస్), సికింద్రాబాద్, హౌరా (ఫలక్నుమా ఎక్స్ప్రెస్), సికింద్రాబాద్, దానాపూర్ (దానాపూర్ ఎక్స్ప్రెస్), నిజామాబాద్, తిరుపతి (రాయలసీమ ఎక్స్ప్రెస్) (వయా… సికింద్రాబాద్) రైళ్లు పట్టాలెక్కనున్నాయి. వీటితో పాటు సికింద్రాబాద్, నిజాముద్దీన్ (దురంతో ఎక్స్ప్రెస్ (వారానికి రెండు సార్లు) ప్రారంభం కానుంది. అదే విధంగా ముంబై, భువనేశ్వర్(కోణార్క్ ఎక్స్ప్రెస్) వయా సికింద్రాబాద్) రైలు కూడా ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.
Secunderabad Railway Station begins June 1 amid Lockdown