Friday, March 29, 2024

విత్తనాలు సిద్ధం

- Advertisement -
- Advertisement -

Seeds for cultivation of yasangi crops in telangana

యాసంగిలో వేరుశనగ, మినుము, పెసర, పొద్దుతిరుగుడు పంటలు వేసుకోవచ్చు

మొత్తం 45లక్షల ఎకరాల్లో యాసంగి సాగు అవకాశాలు
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు మేలు
నువ్వులకు మంచి డిమాండ్ ఉంది
అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం
విత్తనాభివృద్ధి సంస్థ

మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి పంటల సాగుకు అవసరమైన విత్తనాలు సిద్దంగా ఉన్నట్టు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సంచాలకులు డా.కేశవులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు యాసంగి పంటల సాగుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్టు తెలిపారు. యాసంగిలో మొత్తం 48లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేశామన్నారు. శనగ, మినుము , పెసర, నువ్వు, వేరుశనగ, పొద్దు తిరుగుడు వరి తదితర 13రకాల పంటలు సాగులోకి వస్తాయన్నారు. యాసంగి పంటల సాగుకు 11.50లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేసి వుంచినట్టు వెల్లడించారు. యాసంగిలో శనగ పంట ఈ సారి అధికంగా సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయలేమని ఇప్పటికే తేల్చి చెప్పిందన్నారు. రాష్ట్రంలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసుకుంటే లాభదాయకంగా ఉంటుందన్నారు. ఆరుతడి పంటల కింద మినుము ,పెసర, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం తదితర పంటల సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

చిరుధాన్య పంటలు సాగు చేస్తే వాటికి మార్కెట్‌లో మంచి ధర లభిస్తుందన్నారు. వానాకాలం వరిసాగు చేసిన పొలాల్లో కూడా వరి కోతల అనంతరం ఆరుతడి పంటలు సాగు చేసుకుంటే మంచి దిగుబడులు లభిస్తాయని తెలిపారు. వరి తర్వాత వేరుశనగ, మినుము, పెసర, పొద్దుతిరుగుడ తదితర పంటలు వేసుకోవచ్చన్నారు. నువ్వులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుకు ఒక సారి అలవాటు పడితే రాష్ట్రంలో వ్యవసాయరంగం ముఖచిత్రమే మారిపోతుందన్నారు. గత యాసంగిలో సూర్యాపేట, ఖమ్మం, వరంగల్ ,మహబూబాబాద్ ,జగిత్యాల, మెదక్ , సిద్దిపేట తదితర జిల్లాల్లో వేరుశనగ పంటనుసాగు చేసి రైతులు మంచి దిగుబడి సాధించారని తెలిపారు. నువ్వు పంటను జగిత్యాల, కరీంనగర్ , సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తున్నారని తెలిపారు. ఈ పంటకు మార్కెట్‌లో అత్యధిక ధర లభిస్తుందన్నారు. యాసంగిలో విత్తన కొరత లేకుండా అన్ని రకాల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ డా.కేశవులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News