Thursday, April 25, 2024

తమిళ ఓట్ల కోసం రాజదండం!

- Advertisement -
- Advertisement -

అసలు అది రాజదండం కాదు, చరిత్రలో వర్ణించిన చోళ రాజరిక దండ నమూనా మాత్రమే. స్వాతంత్య్ర తరుణంలో అధికార మార్పిడి గురుతుగా ఏదైనా క్రతువు నిర్వహించుతారా అని మౌంట్ బాటన్ నాడు నెహ్రూను అడిగారట. దాని గురించి రాజాజీగా సుపరిచితులైన సి రాజగోపాలచారిని నెహ్రూ సంప్రదించగా చోళ రాజుల పద్ధతిని పాటిద్దామని చెప్పారట. ఈ పూర్వరంగంలో తమిళనాడులోని తిరువదుత్తురై అనే ఒక మఠానికి చెందిన వారు 1947 ఆగస్టు 14 రాత్రి నెహ్రూకు నమూనా రాజదండాన్ని పూజా పునస్కార తంతుతో బహూకరించారు తప్ప దానికి మౌంట్ బాటన్‌కు ఎలాంటి సంబంధమూ లేదు. నమూనా రాజదండాన్ని ఉమ్మిడి బంగారు చెట్టి రూపొందించగా ఉమ్మిడి ఎతిరాజులు (96), ఉమ్మిడి సుధాకర్ (88) తయారు చేశారు. వారు చెన్నైలో నివసిస్తున్నారు. క్రీస్తు పూర్వం 300 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1279 వరకు చోళ రాజుల పాలన సాగింది. అంటే తరువాత వారి రాజదండాన్ని ఎవరికిచ్చినట్లు? తరువాత వచ్చిన రాజులు దాన్ని పక్కన పెట్టి కొత్త రాజదండాలను వాడారా అసలు సిసలు దండం ఎక్కడ ఉన్నట్లు అన్న ప్రశ్నకు సమాధానం లేదు.

అసలు పురావస్తుశాలలోని రాజదండం ఎలా వెలుగులోకి వచ్చిందన్నది ఆసక్తికరం. దీని కోసం చెప్పిన “కత” విన్న తరువాత సందేహాలు తలెత్తటం సహజం. దీన్ని చరిత్రాత్మక రాజదండం అని వర్ణించడంతోనే పురాతన వస్తువు పేరుతో నకిలీలను అంటగట్టే మోసగాళ్లను గుర్తుకు తెచ్చారు. చోళులనాటి ఈ రాజదండాన్ని బ్రిటీష్ వారికి అందచేయగా వారి చివరి ప్రతినిధి మౌంట్‌బాటన్ అధికార మార్పిడి సూచికగా దాన్ని నెహ్రూకు అందచేశారన్నది కూడా మోసగాళ్ల కథలో భాగమే. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్‌గా మారిన పూర్వపు అలహాబాద్ నగరంలో నెహ్రూ నివాసం ఆనంద భవన్‌ను ఒక పురావస్తుశాలగా మార్చారు. దానిలో తనకు బహుమతిగా ఇచ్చిన నమూనా రాజదండాన్ని కూడా ఉంచారు. దాన్ని బంగారు చేతి కర్రగా నమోదు చేశారు. ఇది చోళ రాజవంశం నాటిదని చివరికి అమిత్ షా కూడా నమ్మారు. లేదా నమ్మినట్లు నటించి చెప్పారు. పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం దాన్ని తయారు చేసిన ఉమ్మిడి బంగారు చెట్టి కుటుంబీకులు కూడా దాని గురించి మరచిపోయారు.
నిజానికి దానికి అంతటి ప్రాధాన్యం ఉంటే దాన్ని తయారు చేసిన ఆ కుటుంబీకులు ఇప్పటికీ సజీవులుగా ఉన్నప్పటికీ గడచిన 75 సంవత్సరాలుగా తమ వారికి చెప్పలేదంటే తాము తయారు చేసిన అనేక వస్తువుల్లో ఒకటిగా చూశారు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.

ఆ కుటుంబానికి చెందిన ఉమ్మిడి అమరేంద్రన్ చెప్పిన దాని ప్రకారం 2018లో ఒక పత్రికలో దాని గురించి చదివారట. మరుసటి ఏడాది పురావస్తు శాలలో చూశారట. దాని గురించి ఒక పత్రికా గోష్టి పెడదామనుకుంటే కరోనా (2020లో కరోనా బయటపడింది) కారణంగా కుదరలేదట. దాంతో ఒక నిమిషము నిడివి గల వీడియో తీస్తే అది నరేంద్ర మోడీ కంటబడటంతో వెలుగులోకి వచ్చిందట. దాన్ని ఎప్పుడు తీశారు, నరేంద్ర మోడీ ఎప్పుడు చూశారు, ప్రధానికి వీడియోలు చూసే తీరిక ఉందా అని సందేహం కలగవచ్చు. ఉమ్మిడి కుటుంబం దాన్ని వంద సావరిన్ (సవర్లు)ల బంగారంతో తయారు చేసి ప్రభుత్వం నుంచి రూ. 15 వేలు తీసుకున్నదట. దీని గురించి ప్రధాని మోడీ కార్యాలయం పంపిన బృందంలోని జర్నలిస్టు ఎస్ గురుమూర్తి ఉమ్మిడి కుటుంబాన్ని సంప్రదించారు. వారి కోరిక మేరకు దాని ప్రతిరూపాన్ని రూపొందించారు. వెండితో చేసిన దానికి బంగారు పూత పూశారు. అసలైన బంగారు వస్తువును శాశ్వతంగా పార్లమెంటు భవనంలో, దాని ప్రతిరూపాన్ని జనం కోసం ప్రదర్శిస్తారని చెప్పారు.

గవర్నర్ జనరల్‌గా ఉన్న రాజగోపాలా చారి అనేక పుస్తకాలను చదివి చివరికి చోళుల రాజదండం గురించి తెలుసుకొని కొత్త రాజులకు అధికారిక మార్పిడి సూచికగా రాజదండాలను అందచేసే వారని తెలుసుకొన్నారు. తరువాత తికెవదుత్తురై మఠానికి చెందిన స్వాములను సంప్రదించి బంగారు రాజదండాన్ని తయారు చేయించి వారి ద్వారానే నెహ్రూకు అంద చేయించారు. దీనికి నెహ్రూ అంగీకరించారని చెబుతున్నారు. అదే గనుక వాస్తవమైతే అదే నెహ్రూ దాన్ని ఎందుకు పక్కన పడవేసినట్లు? తన తరువాత అధికారానికి వచ్చే వారికి దాన్ని అందచేసేందుకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? ఈ విషయాలన్నీ తరువాత అధికారానికి వచ్చిన లాల్‌బహదూర్ శాస్త్రికి ఎవరూ ఎందుకు చెప్పలేదు? నెహ్రూకు అందచేసిన మఠాధిపతులైనా తరువాత ప్రధానులుగా చేసిన వారికి కూడా ఎందుకు ఈ ఘనమైన సంప్రదాయం, సంస్కృతి గురించి ఎందుకు గుర్తు చేయలేదు? ఇలా ఆలోచించటం కూడా జాతి వ్యతిరేకం అంటారేమో? రాజదండ ప్రహసనం వచ్చే ఎన్నికల్లో తమిళుల ఎన్నికల కోసమే అన్న విమర్శ ఉంది.

ద్రావిడనాడు అనే పత్రికలో 1947 ఆగస్టు 24వ తేదీ సంచికలో తరువాత డిఎంకె స్థాపకుడిగా, సిఎంగా పని చేసిన సిఎన్ అన్నాదురై రాజదండం బహూకరించిన వారి ఉద్దేశం ఏమిటో గ్రహించాలని నెహ్రూను హెచ్చరిస్తూ రాశారు. దానిలో ఎక్కడా అది చోళుల నాటి రాజదండం అని గానీ పరంపరగా అధికార బదిలీ గురించి గానీ లేదు. అన్ని రకాలుగాను జనాన్ని దోచుకుంటున్న మఠాలు, స్వాములు కేంద్ర ప్రభుత్వాన్ని మంచి చేసుకొనేందుకు, తమ ఆస్తుల జోలికి రాకుండా, ఎదురు లేకుండా చేసుకొనేందుకు గాను దాన్ని బహూకరించినట్లు పేర్కొన్నారు. దాని గురించి తమిళనాడు ప్రభుత్వ పత్రాల్లో ప్రస్తావించారు. ఇపుడు అధికారిక పురోహితులు, స్వాములు లేరు. ఏ ప్రాతిపదికన రాజరిక చిహ్నమైన రాజదండాన్ని పట్టుకొని నరేంద్ర మోడీ ఒక మతానికి చెందిన 20 మఠాల వారిని పార్లమెంటులో నడిపించినట్లు? ఇదంతా నూతన పార్లమెంటు భవనం బదులు ఒక రాజు కొత్త కోటను ప్రారంభించినట్లుగా ఉంది. అందుకే కొల్‌కతా నుంచి వెలువడే టెలిగ్రాఫ్ దినపత్రిక పతాక శీర్షికలో క్రీస్తు పూర్వం 2023 అని ప్రముఖంగా ప్రచురించింది. రాజరికాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ రాజదండం అన్నది 1300 సంవత్సరాల నుంచి మాత్రమే ఉనికిలోకి వచ్చిందని, దాని అసలు పేరు నంది ధ్వజము అని ఆరియాలజిస్టులు సిహెచ్ బాబ్జీరావు, ఇ శివనాగిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

స్వాములుగా చెలామణిలో ఉన్న కొందరు రాజదండాన్ని ధర్మదండం అని పిలిచేవారని చెబుతున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాకు మద్దతుగా సాంప్రదాయాల గురించి స్వామీజీలు, మరి కొందరు రంగంలోకి దిగారు. రాజు కోరుకుంటే ఇలాంటి వారికి కొదవా? వారి వాదనలసారం ఇలా ఉంది.
రాజు దైవాంశ సంభూతుడని చిత్రించిన వారు, నిరంకుశ రాజరికాలను ప్రోత్సహించిన వారు రాజదండాన్ని ఆ దేవుడే పంపాడు, దేవుడి ప్రతినిధులం తాము గనుక రాజులకు అందించే తంతు తమదని పూజారులు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ భావనలను, హిందూత్వను ముందుకు తెచ్చిన విడి సావర్కర్ కూడా నమ్మారు, అతగాడిని ఆరాధించే శక్తులు గనుకనే సావర్కర్ జన్మదినం రోజునే పార్లమెంటులో రాజదండం ప్రతిష్టాపన, భవన ప్రారంభోత్సవం జరిపారు. అదేమీ కాదు, ఏదో ఒక తేదీని ఎంచుకోవాలి కదా అలా చేస్తే ఏదో అలా కలసి వచ్చిందని చెబితే ఎవరూ నమ్మరు.

రాజరికాలను తిరిగి ప్రతిష్టించాలనే కోరిక, తిరిగి సమాజాన్ని వెనక్కునడపాలనే, ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి హిందూత్వ పాలన రుద్దాలన్న ప్రగాఢ వాంఛ నరనరాన ఉన్నవారే దీనికి పాల్పడతారని వేరే చెప్పనవసరం లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆలోచనలు అనే గ్రంథంలో బిఆర్ అంబేడ్కర్ రాసిన ఒక పేరాలో ఏముందో చూద్దాం. ‘ఒక బ్రాహ్మణుడు స్వతంత్ర దేశ తొలి ప్రధాని అయిన సందర్భంగా పండుగ చేసుకొనేందుకు బనారస్ బ్రాహ్మలు చేసిన యజ్ఞంలో ప్రధాని నెహ్రూ పాల్గొనలేదు. ఆ బ్రాహ్మలు అందించిన రాజదండాన్ని ధరించలేదు, గంగ నుంచి తెచ్చిన జలాన్ని తాగలేదు’ అని రాశారు. అధికార మార్పిడి జరిగిన మరుసటి రోజు యజ్ఞం జరిగింది. అధికార మార్పిడి చిహ్నంగా రాజదండం, దాన్ని మౌంట్‌బాటన్ అందచేశాడనడానికి ఎలాంటి రుజువులు, ఆధారాలు లేవు. గోద్రా ఉదంతం తరువాత గుజరాత్‌లో జరిగిన మారణకాండ సందర్భంగా రాజధర్మం పాటించాలని ప్రధానిగా ఉన్న వాజ్‌పేయీ నరేంద్ర మోడీకి హితవు చెప్పిన సంగతి తెలిసిందే. దాన్ని పాటించిన దాఖలాల్లేవు.

రాజులు దండాన్ని దుష్టుల మీద ప్రయోగించాలని చెప్పారు. ఎంపి బ్రిజ్ భూషణ్ తమ మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదు మేరకు విధిలేక కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోక్సో కేసు పెట్టిన వారిని అరెస్టు చేస్తారన్న సంగతి తెలిసిందే. కానీ తన పార్టీకి చెందిన సదరు ఎంపి బ్రిజ్ భూషణ్‌కి మద్దతుగా కొందరు ప్రదర్శనలకు దిగుతున్నారు. గుజరాత్‌లో అత్యాచారాలకు పాల్పడి రుజువైన కేసులో శిక్షలను పూర్తిగా అమలు జరపకుండా నేరగాండ్లను విడుదల చేసి వారికి గౌరవ మర్యాదలు చేసిన బిజెపి ఘనులను నరేంద్ర మోడీ పల్లెత్తు మాట అనలేదు. బ్రిజ్ భూషణ్‌ను కాపాడుతూ అరెస్టు డిమాండ్ చేస్తున్న రెజ్లర్ల మీద దండాన్ని ఝళిపించి అధికారాన్ని దేనికి, ఎలా ఉపయోగించేదీ బేటీ పడావో బేటీ బచావో అని చెప్పిన నరేంద్ర మోడీ లోకానికి వెల్లడించారు. ఇది మన గతం, సంప్రదాయం అని మనం నమ్మాలి, ఏమి చేసినా కిమ్మన కూడదు? రాజదండ సందేశమిదే!.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News