ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం నష్టాలను చవిచూశాయి. వరుసగా నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ట్రెండ్ కారణంగా ఐటి, బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్స్లో విక్రయాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ 148 పాయింట్లు కోల్పోయి 40,558 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 11,896 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 3.10 శాతం నష్టపోయింది. ఆ తర్వాత నష్టాలను చవిచూసిన వాటిలో ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టైటాన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా ఉన్నాయి.
మరోవైపు ఎన్టిపిసి, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ సంస్థలు 3.10 శాతం వరకు లాభాలను నమోదు చేశాయి. కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో సెంటిమెంట్ బలహీనంగా కనిపించింది. అదే సమయంలో అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై ఇంకా ఎటూ తేల్చకపోవడం ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. మెటల్స్, ఎఫ్ఎంసిజి మినహా ఇతర రంగాలు నష్టాలతో ముగిశాయి. స్టాక్స్ విషయానికొస్తే టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, ఎన్టిపిసి టాప్ గెయినర్లుగా ఉండగా, మరోవైపు హీరో మోటోకార్ప్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్ టాప్ లూజర్లుగా మిగిలాయి.
Sensex Falls 148 Pts And nifty settles below 11900