మనతెలంగాణ/హైదరాబాద్:కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదంలో మహిళపై దాడి చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి స్టేషన్ బేయిల్ రావడంతో విడుదలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. శేరిలింగంపల్లి, నల్లగండ్ల సమీపంలోని లక్ష్మివిహార్ ఫేస్ నంబర్ 2లోని విల్లాస్లో శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ ఉంటున్నాడు. అదే విల్లాలోని 17లో ఉంటున్న మహిళ కారులో ఇంటికి వస్తుండగా కార్పొరేటర్ కారు ముందుకు వెళ్లకుండా అడ్డుగా ఉంది. అక్కడే ఉన్న సెక్యూరిటీకి కారు పక్కకు తీయాల్సిందిగా కోరింది. వెంటనే కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ ఇంట్లోకి వెళ్లి కారు తీయాల్సిందిగా చెప్పాడు. బయటికి వచ్చిన నాగేందర్, మహిళ ఇద్దరు తిట్టుకున్నారు. కారును పక్కకు తీసిన తర్వాత మహిళ కారుతో తన విల్లాకు వెళ్లిపోయింది. ఆమె విల్లా వద్దకు వచ్చిన కార్పొరేటర్ నాగేందర్ ఆవేశంతో మహిళను తిట్టడంతోపాటు దాడి చేశాడు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న మహిళ బంధువులు వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం అరెస్టు చేశారు. తర్వాత బేయిల్ రావడంతో నిందితుడు విడుదలయ్యాడు.
Serilingampally Corporator Arrested for attack on Woman