ట్రైయినీ ఐపీఎస్ సుధీర్ రాంనాధ్ కేకన్
మనతెలంగాణ/గణపురం: బాల్య వివాహాలు జరిపిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రైయినీ ఐపీఎస్ సుధీర్ రాంనాధ్ కేకన్ అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కుందయ్యపల్లిలో ఒక మైనర్ బాలికకు బాల్య వివాహం జరిపిస్తున్నారనే సమాచారంతో సిడిపిఓ అవంతి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులతో కలిసి వివాహాన్ని నిలిపివేశారు. ఈ సందర్భంగా బాలికకు, తల్లిదండ్రులకు, వరుడికి కౌన్సిలింగ్ చేశారు. అనంతరం ట్రైయినీ ఐపీఎస్ మాట్లాడుతూ… బాలికకు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేయాలని, మైనర్లకు వివాహం జరిపిస్తే రెండు సంవత్సరాల జైలుశిక్ష, జరిమానా విధించబడుతుందని అన్నారు. బాల్య వివాహాలు జరిగితే గ్రామ సర్పంచ్ను మొదటి బాధ్యునిగా పరిగణించాల్సి వస్తుందని, గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత సర్పంచ్దేనని అన్నారు. 18 సంవత్సరాలలోపు బాలికలకు వివాహం చేస్తే వారికి శారీరక, మానసిక సమస్యలు తలెత్తడమే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని బాల్య వివాహ నిరోధక అధికారి, భూపాలపల్లి సిడిపిఓ సిహెచ్ అవంతి అన్నారు.
బాల్య వివాహాలు, బాలల హక్కుల ఉల్లంఘన వంటి సమాచారాన్ని 1098 చైల్డ్లైన్, 100, 181 టోల్ఫ్రీ నెంబర్లకు గాని జిల్లాలోని బాల్య వివాహా నిరోధక అధికారులకు గానీ అందించాలని కోరారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారులు జి రాజకొమురయ్య, ఎ వెంకటస్వామి, సోషల్ వర్కర్లు పి లింగారావు, ఎం శైలజ, 1098 చైల్డ్లైన్ జిల్లా కోఆర్డినేటర్ ఆర్ సుమన్, సిబ్బంది రమేష్, గ్రామ సర్పంచ్ మధుసూధన్రావు, పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, అంగన్వాడీ టీచర్ సుమలత, తదితరులు పాల్గొన్నారు.