అహ్మదాబాద్: ఫేస్ మాస్క్ ఉల్లంఘనదారులకు జరిమానాతోపాటు కొవిడ్-19 కేంద్రాలలో సామాజిక సేవ చేయడం తప్పనిసరి చేస్తూ ఒక నోటిఫికేషన్ జారీచేయాలని గుజరాత్ హైకోర్టు బుధవారం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్-19 కేంద్రాలలో వీరు వైద్యేతర విభాగాలలో సామాజిక సేవ చేయాలని, రోజుకు 6 గంటల చొప్పున 5 నుంచి 15 రోజులు సేవ చేయాల్సి ఉంటుందని చీఫ్ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జెబి పార్థవాలాతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ శిక్షపై ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోర్టు ఆదేశించింది. ఫేస్ మాస్క్ ధరించని వ్యక్తి తనను తాను ప్రమాదంలో పెట్టుకోవడమే కాక యావత్ సమాజాన్నే ప్రమాదంలోకి నెడుతున్నాడని కోర్టు అభిప్రాయపడింది. అందుచేత సమాజాన్ని ప్రమాదం అంచులకు నెడుతున్న వ్యక్తే అందుకు శిక్షగా అదే సమాజానికి సేవ చేయాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. కరోనా కేసులు ఇటీవలి కాలంలో పెరిగిపోవడానికి ప్రజలలో నిర్లక్షధోరణే కారణమని, మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవడం వంటి చర్యల వల్లే కేసులు పెరుగుతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఫేసు మాస్కే కరోనా వైరస్కు వ్యాక్సిన్లాంటిదని శాస్త్ర పరిశోధనలు చెబుతున్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది.
Service at Covid Center if not wearing mask: Gujarat HC