Thursday, April 25, 2024

సేవాలాల్‌ చూపిన మార్గంలో నడవాలి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నిర్మ‌ల్: బంజారాల ఆరాధ్య గురువు సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ చూపిన మార్గంలో నడవాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లోని దివ్యాన‌గ‌ర్ లో శుక్ర‌వారం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 284వ జయంతి వేడుకలను ఘ‌నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య‌ అతిథిగా హాజరయ్యారు. తొలుత జ్యోతిప్రజ్వాల‌న చేసి వేడుక‌ల‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…. సమాజ శ్రేయస్సు కోసం సంత్‌ సేవాలాల్‌ చూపించిన మార్గం ఆదర్శనీయమన్నారు. సేవాలాల్ మహారాజ్ త‌న బోధ‌నల వల్ల బంజారా జాతిపురోగమించడానికి కృషి ఎంతో చేశార‌ని, వారి అభివృద్థికి, తండాల నిర్మాణానికి సేవాలాల్‌ తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు. అలాంటి సేవాలాల్‌ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఆయన బోధనలను అందరూ ఆచరించాలని సూచించారు.

గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు పాటుపడుతున్నదని అన్నారు. స్వరాష్ట్రంలో గిరిజనుల వికాసం సాధించాలనే గొప్ప సంకల్పంతో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని తెలిపారు. స్వయం పరిపాలన విధానాన్ని అమలు చేసి గిరిజనులకు రాజ్యాధికారం దక్కేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని అన్నారు. బంజారాల ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను దేశంలో ఎక్క‌డ లేని విధంగా అధికారికంగా నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు. అంతేగాకుండా, సేవాలాల్ జయంతి వేడుకల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసి గిరిజనులపై ఉన్న ప్రేమ, అభిమానులను చాటుకుందని వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో జ‌గ‌దాంబ – సేవాలాల్ మందిరానికి రూ. కోటి మంజూరు చేశామ‌ని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News