Thursday, April 25, 2024

‘గ్రీన్‌ఇండియా’ గిన్నీస్ సంబురం

- Advertisement -
- Advertisement -

SH groups in Mahabubnagar have won Guinness Book of World Records

విత్తన బంతుల తయారీలో భాగస్వాములైన ఎస్‌హెచ్‌జి బృందానికి అభినందన కార్యక్రమం
పర్యావరణ పరిరక్షణ, ఆకుపచ్చ తెలంగాణ సిఎం కెసిఆర్ నిర్ణయం,నినాదం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
వచ్చే సంవత్సరంలో మూడు కోట్ల విత్తన బంతులు తయారు చేయాలి : ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు సంబంధించిన అవార్డును గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో అంకితం ఇచ్చారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా గత సంవత్సరం మహబూబ్ నగర్ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు 10 రోజుల్లో రెండు కోట్ల 8 లక్షల 24 వేల విత్తన బంతులను తయారు చేసి ఆ విత్తన బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్ రికార్డు సాధించారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడంలో భాగస్వాములైన వారికి అభినందనగా సర్టిఫికెట్‌ల ప్రధానం కార్యక్రమం మంగళవారం హోటల్ హరిత ప్లాజాలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ హాజరయ్యారు.

2,087 ఎకరాల్లో కెసిఆర్ అర్భన్ ఎకో పార్క్

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు పెద్ద ఎత్తు మొక్కలు నాటడం సంతోషకరమన్నారు. అంతేకాక దేశంలోనే అతిపెద్దదైన 2,087 ఎకరాల్లో కెసిఆర్ అర్భన్ ఎకో పార్క్ ను చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచా మన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆకుపచ్చ తెలంగాణ, తెలంగాణను సస్యశ్యామలం చేయడం వంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు కళలకు ప్రతిరూపంగా అతి తక్కువ కాలంలో జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టాలన్న స్ఫూర్తితో జిల్లాలో గత సంవత్సరం రెండు కోట్ల 8 లక్షల 24 వేల విత్తన బంతులను మహిళా సంఘాలు తయారుచేసి చల్లడం జరిగిందన్నారు. అంతేకాక ఆ విత్తన బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించి జిల్లాకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడం గర్వకారణమన్నారు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మంత్రి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్స్‌ను ప్రధానం చేసి ఆయన అభినందించారు.

భూగర్భ జలాలు, పచ్చదనాన్ని పెంపొందించాం

2014 లో జిల్లా ఎంతో వెనుకబడి ఉండేదని, ఇప్పుడు జిల్లా రూపురేఖలు మారిపోయాయని, 25 పార్కులను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లాలో భూగర్భ జలాల పెంపుతో పాటు, పచ్చదనాన్ని పెంపొందించడం జరిగిందని, భూగర్భ జలాలు పన్నెండు మీటర్ల నుంచి ఆరు మీటర్ల మేర పెరిగాయని గతంలో వెయ్యి ఫీట్లు తవ్విన నీరు పడేది కాదన్నారు. కెసిఆర్ అర్బన్ ఎకో పార్క్ లో త్వరలోనే పక్షుల ఎంక్లోజర్ ను ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

మినీ జూ ఏర్పాటుకు రూ.50 లక్షలు: ఎంపి సంతోష్ కుమార్

కెసిఆర్ అర్భన్ ఎకో పార్కులో మినీ జూ ఏర్పాటు చేసేందుకు తన నిధుల నుంచి 50 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ఎంపి సంతోష్ కుమార్ ఈ సందర్భంగా ప్రకటించారు. జిల్లా మహిళా సంఘాలు వచ్చే సంవత్సరంలో 3 కోట్ల విత్తన బంతులు తయారు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు, డిఆర్‌డిఓ యాదయ్య, పూర్వపు మెప్మా పిడి శంకరాచారి, డిఐఓ సత్య నారాయణ మూర్తి, డిపిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఎపిడి శారద, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సురేఖ, ఎఫ్‌ఆర్‌ఓ రంజిత్, డిపిఎం నాగమల్లిక, చెన్నయ్య, అనిల్, సుదర్శన్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News