మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై ఆ దేశ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్తో జరిగిన మూడో వన్డేలో స్టార్ బౌలర్ పాట్ కమిన్స్కు విశ్రాంతి ఇవ్వడాన్ని వార్న్ తప్పుపట్టాడు. రానున్న టెస్టు సిరీస్ను దృష్టిలో పెట్టుకుని కమిన్స్కు విశ్రాంతి ఇచ్చామని, అందుకే అతన్ని మూడో వన్డే నుంచి తప్పించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై వార్న్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కీలకమైన భారత్ సిరీస్లో కమిన్స్కు విశ్రాంతి ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదన్నాడు. ఇతర జట్లతో పోల్చితే టీమిండియా బలమైన జట్టనే విషయాన్ని క్రికెట్ బోర్డు గుర్తుంచుకోవాలన్నాడు. కమిన్స్ లేక పోవడంతో మూడ వన్డేలో భారత బ్యాట్స్మన్ భారీగా పరుగులు పిండుకున్నారన్నాడు. ఒకవేళ కమిన్స్ తుది జట్టులో ఉంటే టీమిండియాను తక్కువ స్కోరుకే కట్టడి చేసే అవకాశాలు మెరుగ్గా ఉండేవన్నాడు. ఐపిఎల్లో ఆడడం వల్ల కమిన్స్ అలసి పోయాడని, అందుకే టెస్టు సిరీస్ను దృష్టిలో పెట్టుకుని అతనికి విశ్రాంతి ఇచ్చినట్టు బోర్డు అధికారులు ప్రకటించడం తనను బాధకు గురి చేసిందన్నాడు.
ఐపిఎల్తో పోల్చితే భారత్తో జరిగే సిరీస్ కమిన్స్కు చాలా కీలకమన్నాడు. ఇటీవల కాలంలో చాలా మంది క్రికెటర్లతో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఐపిఎల్, బిపిఎల్, పిఎస్ఎల్ వంటి లీగ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఇది క్రికెట్ అభివృద్ధికి ఏమాత్రం శ్రేయస్కారం కాదన్నాడు. ఏ క్రికెటర్కైన తొలి ప్రాధాన్యం దేశమేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. ఐపిఎల్లో ఆడి అలసి పోయాడని, అందువల్లే విశ్రాంతి కోసం చివరి వన్డేను ఆడించలేదని ఆస్ట్రేలియా బోర్డు ప్రకటించడంపై వార్న్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Shane Warne unhappy with Australia for rest to Commins