Friday, March 29, 2024

ఆదుకున్న శార్దూల్, సుందర్

- Advertisement -
- Advertisement -

ఆదుకున్న శార్దూల్, సుందర్
అర్ధ శతకాలతో రికార్డు భాగస్వామ్యం
భారత్ తొలి ఇన్నింగ్స్ 336 పరుగులకు ఆలౌట్
ఆసక్తికరంగా బ్రిస్బేన్ టెస్టు

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌట్ అయింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వాషింగ్టన్ సుందర్ (144 బంతుల్లో 62), శార్దూల్ ఠాకూర్ (115 బంతుల్లో 67) అర్ధ శతకాలతో రాణించారు. ప్రధాన బ్యాట్స్‌మెన్ పెద్ద స్కోర్లు చేయకపోయినా వీరిద్దరూ పట్టుదలతో రాణించారు. ఈ క్రమంలోనే గబ్బా మైదానంలో టీమిండియా తరఫున ఏడో వికెట్‌కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యం 33 పరుగులకు పరిమితమైంది. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 5 వికెట్లు పడగొట్టగా, స్టార్క్, కమిన్స్‌లు చెరి రెండు వికెట్లు, లైయన్ ఒక వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే వేళకు వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 20 పరుగులు, మార్కస్ హారిస్ ఒక పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకు ముందు రెండు వికెట్ల నష్టానికి 62 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు ఆట కొనసాగించిన టీమిండియా తొలి సెషన్‌లో మరో 99 పరుగులు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 105 పరుగుల వద్ద పుజారా (25) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పైన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత రహానె (37), మయాంక్ అగర్వాల్(38)లు నిలకడగా ఆడినా భోజన విరామ సమయానికి ముందు భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. స్టార్క్ బౌలింగ్‌లో రహానే వేడ్ చేతికి చిక్కాడు. అప్పటికి భారత్ స్కోరు 4 వికెట్లకు 144గా ఉంది.తర్వాత మయాంక్ అగర్వాల్, పంత్‌లు జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. భోజన విరామ సమయానికి భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 161 పరుగులుగా ఉంది.
ఆదుకున్న శార్దూల్, సుందర్
అయితే భోజన విరామం అనంతరం తొలి ఓవర్‌లోనే మయాంక్ అగర్వాల్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో స్మిత్‌కు చిక్కాడు. కాస్సేపటికే పంత్ కూడా గ్రీన్ చేతికి చిక్కడంతో భారత్ 186 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఇక మిగిలింది టెయిలెండర్లే కావడంతో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యత దక్కడం ఖాయంగా కనిపింది. అయితే శార్దూల్, సుందర్ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా రెండో సెషన్‌ను ముగించారు. దీంతో భారత్ జట్టు స్కోరు 6 వికెట్ల నష్టానికి 253 పరుగులకు చేరింది. టీ విరామం తర్వాత మరింత చెలరేగిన వీరిద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఇద్దరూ అర్ధ శతకాలతో ఏడో వికెట్‌కు శతక భాగస్వామ్యం జోడించారు. దీంతో భారత్ స్కోరు 300 పరుగులు దాటింది. చివరికి 309 పరుగుల వద్ద శార్దూల్‌ను కమిన్స్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత సైని(5), సుందర్ (62), సిరాజ్(13) త్వరగా ఔటయ్యారు. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 336 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్ ఆధిక్యతను 33 పరుగులకు పరిమితం చేసింది.

Shardul Thakur and Sundar set record partnership

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News