Tuesday, April 23, 2024

రెండో విడత గొర్రెల పంపిణీ… యూనిట్ కు రూ.1.75 లక్షలు…

- Advertisement -
- Advertisement -

Sheep distribution in second phase

సిద్దిపేట: 74 ఏండ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్వరాష్ట్రం సాధించుకున్న ఏడున్నర సంవత్సరాలలో చేపట్టామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఉద్యమ నాయకుడుగా ఉన్న  కెసిఆర్ ప్రభుత్వ సారథి కావడం వల్లే గొప్ప పాలన చేయడం వల్లే ఇది సాధ్యమైందని ప్రశంసించారు.  శుక్రవారం వర్గల్ మండల కేంద్రంలోని మల్లిఖార్జున స్వామి ఫంక్షన్ హాల్ లో పశు వైద్య, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో సాముహిక గొర్రెలు, మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమం జరిగింది. గొర్రెలు, మేకలలో ఉచిత నట్టల నివారణ కు మందులు పంపిణీ చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పశు సంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

ప్రజా అవసరాలను తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అని కెసిఆర్ భావించారని, ఈ క్రమంలోనే కుల వృత్తులకు చేయూత అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమన్నారు. గొర్రెల పంపిణీ, సంపద అభివృద్థిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఆయన కొనియాడారు.  ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు, పాలకులు గొల్ల, కురుమల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంలో పశుసంవర్థకశాఖకు సిఎం కెసిఆర్ అందిస్తున్న సహకారంతో ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ప్రభుత్వం రూ. 5 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ మంచి ఫలితం ఇచ్చిందని ప్రశంసించారు.

2వ విడత పంపిణీ కోసం సర్కారు రూ.6 వేల కోట్లు విడుదల చేసిందని, పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని గొర్రెల యూనిట్ ధరను రూ.1.25 లక్షల నుంచి 1.75 లక్షలకు సిఎం పెంచారని, గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా పశువైద్యాధికారులకు సూచించారు. పంపిణీ చేసే గొర్రెలకు కొనుగోలు చేసిన ప్రాంతంలోనే బీమా పత్రాలను అందజేసేలా ఏర్పాటు చేయాలని సూచించారు. గొర్రెలు చనిపోతే సకాలంలో బాధితులకు బీమా అందించేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. పెరిగిన జీవాలకు అనుగుణంగా గ్రాసం కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని, రైతులకు సబ్సిడీ పై గడ్డి విత్తనాలను సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. జీవాల వద్దకే వైద్యసేవలు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రారంభించిన సంచార పశువైద్యశాలల బాగా పనిచేస్తున్నాయన్నారు.

గొర్రెల పెంపకందారులు గొర్రెలను అమ్ముకునేందుకు, కొనుగోలు చేసేందుకు అన్నిరకాల సౌకర్యాలు, వసతులతో కూడిన మార్కెట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఖమ్మం, పెద్దపల్లి, వనపర్తి తదితర జిల్లాలలో గొర్రెల మార్కెట్ల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రంలో గొర్రెల మార్కెట్ నిర్మాణానికి అవసరమైన 5 ఎకరాల భూమిని ఆయా జిల్లా కలెక్టర్ల సహకారంతో గుర్తించేలా చర్యలు తీసుకోవాలని తలసాని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పశు వైద్యశాలలను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామని, జీవాలకు వైద్య సేవలు అందించే విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తుందని అన్నారు. పశు వైద్య అధికారులు, గోపాల మిత్రలు ఈ విషయంలో అంకితభావంతో పని చేయాలన్నారు. స్థలం సమకూరిస్తే గజ్వేల్ కు గొర్రెల మార్కెట్ నిర్మాణం చేపడతామని తలసాని స్పష్టం చేశారు. మేత కోసం అడవుల్లో గొర్రెల ను తిప్పవచ్చునని తెలిపారు. ఇదివరకే ప్రభుత్వం ఈ విషయం లో జిఓ జారీ చేసిందన్నారు.

గజ్వేల్ దేశానికే ఆదర్శం

అభివృద్ధి అంశంలో గజ్వేల్ నియోజకవర్గం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. ఈ నియోజవర్గంలో ఉండడం ప్రజల అదృష్టమన్నారు. రెండో విడతకు సంబంధించి గజ్వేల్ నియోజకవర్గంలోని లబ్దిదారులు గొర్రెల యూనిట్ ల కోసం డిడి లు వారం రోజుల్లోగా కడితే వచ్చే 10 రోజుల్లో గొర్రెల యూనిట్ లను పంపిణీ చేస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఇందుకోసం ప్రత్యేక చొరవ చూపాలన్నారు.

విజయ డైరీ నీ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం

ప్రభుత్వ విజయ డైరీ నీ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. పాడి రైతుల నుంచి పాల సేకరణ చేస్తున్నామని తెలిపారు. పాడి రైతుల కు ఇన్ సెంటీవ్ ఇస్తున్నామన్నారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కల్పిస్తున్నామని తెలిపారు. వర్గల్ లోని ప్రస్తుతం ఉన్న మల్లిఖార్జున స్వామి దేవాలయం స్థానంలో కొత్త మల్లిఖార్జున స్వామి దేవాలయం నిర్మించేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేస్తానని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News