Friday, April 26, 2024

నేపాల్ ప్రధానిగా షేర్‌ బహదూర్‌ దేవుబా నియామకం

- Advertisement -
- Advertisement -

కాఠ్మండ్: నేపాల్ ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా(74) నియమితులయ్యారు. నేపాల్ రాజ్యాంగం లోని అధికరణం 76(5) ప్రకారం దేవుబాను ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ నియమించారు. దేవుబా ఐదోసారి ఆ దేశానికి ప్రధాని కానున్నారు. ప్రమాణస్వీకారం ఎప్పుడనేది ఇంకా ప్రకటించలేదు. గతంలో 1995-1997లోనూ, 2001-2002లోనూ, 2004-2005లోనూ 2017-2018లోనూ దేవుబా ప్రధాని పదవిని నిర్వహించారు. సోమవారం నేపాల్ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మేరకు ఆ దేశ అధ్యక్షురాలు దేవుబాను ప్రధానిగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పార్లమెంట్ దిగువసభను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తన తాజా ఆదేశాల్లో పేర్కొన్నది. జులై 18 సాయంత్రం 5 గంటలకు దిగువ సభ సమావేశాలకు ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజ్యాంగం ప్రకారం దేవుబా 30 రోజుల్లోగా దిగువసభలో మెజార్టీని నిరూపించుకోవాలి. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నేత కెపి శర్మఓలి సొంత పార్టీలోనే మెజార్టీ మద్దతు కోల్పోవడంతో గత ఏడు నెలలుగా ఆ దేశంలో అనిశ్చితి నెలకొన్నది. మెజార్టీ కోల్పోయిన ఓలి రెండుసార్లు దిగువసభ రద్దుకు సిఫారసు చేయగా, ఆ దేశ అధ్యక్షురాలు అందుకు ఆమోద ముద్ర వేయడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. తాజాగా రెండోసారి దిగువసభను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఓలి ప్రధాని పదవి నుంచి దిగిపోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

Sher Bahadur Deuba becomes Nepal’s PM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News