Friday, April 19, 2024

కర్నాటక తదుపరి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డికెఎస్: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

మే 20న బెంగళూరులో ప్రమాణస్వీకార కార్యక్రమం

న్యూఢిల్లీ: నాలుగు రోజుల తర్జనభర్జనల అనంతరం సస్పెన్స్ ఓ కొలిక్కి వచ్చింది. కర్నాటక తదుపరి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగాను, స్టేట్ యూనిట్ చీఫ్‌గాను డి.కె.శివకుమార్ కానున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ తరఫున కెసి.వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా గురువారం పార్టీ తరఫున తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే అధికారిక ఎన్నికలు ముగిసే వరకు శివకుమార్ కెపిసిసి అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. డికె. శివకుమార్ ఉపముఖ్యమంత్రిగా ఉండాలన్న షరతుకు పార్టీ అంగీకరించడంతో డీల్ కుదిరింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఇద్దరు కర్నాటక నేతలతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పలు దఫాలుగా జరిపిన సమావేశాల అనంతరం ఎట్టకేలకు దక్షిణాది కర్నాటక రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా శివకుమార్ నియమితులు కానున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన గురువారం సాయంత్రం 7.00 గంటలకు బెంగళూరులో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) సమావేశంలో వెలువడనున్నది. కాగా ప్రమాణస్వీకారం మే 20వ తేదీ మధ్యాహ్నం 12.00 గంటలకు జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కర్నాటక ముఖ్యమంత్రి పదవి కోసం ఏ మాత్రం తగ్గకుండా సిద్ధరామయ్య, శివకుమార్‌లు పోటీపడ్డంతో కాంగ్రెస్‌కు తేల్చడం పెద్ద సవాలుగా మారింది. సోమవారం ముగ్గురు కేంద్ర పరిశీలకులు సిఎల్‌పి సమావేశం, రహస్య బ్యాలెట్ ద్వారా జరిగిన ఓటింగ్ నివేదికను ఖర్గేకు సమర్పించారు.పలు దఫాలుగా సీనియర్ నేతలతో సమావేశమైన ఖర్గే తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఖరారు చేశారు.

ఇటీవల జరిగిన క ర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాల్లో కాంగ్రెస్ 135 స్థానాలు గెలుచుకోగా, అధికార బిజెపి 66 స్థానాలు, జెడి(ఎస్) 19 స్థానాలకు పరిమితమయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News