Saturday, April 20, 2024

సిరివెన్నెల జీవితాన్ని టర్నింగ్ తిప్పిన పాట ఏమిటో తెలుసా?

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: ఉత్తమ పాటల రచయితగా 1986 నుంచి మూడేళ్లపాటు వరుసగా నంది అవార్డులు అందుకున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రిని ఆర్థికంగా మాత్రం సినీ రంగం మొదట్లో ఆదుకోలేకపోయింది. అవార్డు చిత్రాల పాటల రచయితగా ముద్ర పడిపోయిన ఆయన మద్రాసులో కుటుంబాన్ని పోషించలేక మళ్లీ కాకినాడకు వెళ్లిపోయి ఉద్యోగం చేసుకోవాలనుకున్నారన్న విషయం మీకు తెలుసా..అయితే ఆయన జీవితాన్ని టర్నింగ్ తిప్పింది ఓ పాట. ఆ పాటతో సినీ పరిశ్రమలో ఆయన విజయ యాత్ర మొదలైంది. డబ్బుకు డబ్బు పేరుకు పేరు తెచ్చిపెట్టిన ఆ సూపర్ కమర్షియల్ చిత్రం ఏమిటో మీకు తెలుసా?

కాకినాడలో టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే చెంబోలు సీతారామశాస్త్రి సినీ ప్రస్థానం 1986లో ‘సిరివెన్నెల’ . చిత్రంతో ప్రారంభమైంది. అయితే అంతకు రెండేళ్ల ముందే కళాతపస్వి కె. విశ్వనాథ్ ఒక చిత్రంలో సీతారామశాస్త్రి చించిన గంగావతరణం గీతాన్ని తీసుకున్నారు. అది ఆయనకు నచ్చడంతో శాస్త్రినిచెన్నైకి పిలిపించుకొని ‘సిరివెన్నెల’ చిత్రంలో అన్ని పాటలను రాసే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రం విడుదలై చివరకు సీతారామశాస్త్రి ఇంటిపేరుగా మారిపోయింది. అయితే మొదటి చిత్రంలో పాటలు సూపర్‌హిట్టయినప్పటికీ ఆయనకు వెంట వెంటనే అవకాశాలు రాలేదు. పైగా తన తమ్ముళ్లు, చెల్లెళ్లతో సహా దాదాపు 15 మందిని పోషించాల్సిన బాధ్యత ఆయనపై ఉండడంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవారు.

అలాంటి పరిస్థితిలో సిరివెన్నెలకు వరుసగా సంగీతపరమైన చిత్రాలకు మాత్రమే పాటలు రాసే అవకాశాలే వస్తుండటంతో ఆయన మీద క్లాసికల్ రైటర్‌గా ముద్రపడిపోయింది. ఆ రోజుల్లో ద్వంద్వార్థాల పాటలకు క్రేజ్ ఉండడం, అలాంటి పాటలు రాయకూడదని సిరివెన్నెల నిర్ణయించుకోవడంతో ఆయనకు కమర్షియల్ చిత్రాలలో పాటలు రాసే అవకాశాలు రాలేదు. ఇక సినీ జీవితానికి గుడ్‌బై చెప్పేసి కాకినాడకు వెళ్లిపోయి, కాకినాడలో చేస్తున్న టెలిగ్రాఫ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగానికి తిరిగి వెళ్లిపోదామని కూడా ఆ దశలో ఆయన సిద్ధపడ్డారు. శ్రుతిలయలు, స్వర్ణకమలం లాంటి చిత్రాలు అవార్డులు తెచ్చిపెడుతున్నా కమర్షియల్ సక్సెస్ మాత్రం ఆయనకు రాలేదు. 1990 వరకు కూడా అదే పరిస్థితి. 1986,87,88 సంవత్సరాలకు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డులతో హ్యాట్రిక్ సాధించినప్పటికీ కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా ఉండేది ఆయనకు.

Sirivennela sitarama sastry biography

అలాంటి పరిస్థితిలో వెంకటేష్ హీరోగా ఇళయరాజా సంగీత దర్శకత్వంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న బొబ్బిలి రాజా చిత్రంలో పాట రాసే అవకాశం సిరివెన్నెలకు వచ్చింది. దర్శకేంద్రుడి సినిమా అంటేనే పక్కా మాస్ మసాలా ఉంటుంది. అందులో లవ్ డ్యూయట్ సాంగ్.. ఎక్కడ డబుల్ మీనింగ్ పాట రాయమంటారోనని సిరివెన్నెల భయపడ్డారు.
అయితే తనకు జనాలకు ఈజీగా చేరువయ్యే చిన్ని చిన్ని పదాలతో ఒక మంచి పాట రాయమని రాఘవేంద్రరావు చెప్పడం, అందుకు తగ్గట్టుగానే ఇళయరాజా చక్ని ట్యూన్ ఇవ్వడంతో సిరివెన్నెల తన మొదటి కమర్షియల్ పాటకు శ్రీకారం చుట్టారు.

బలపం పట్టి భామ బల్లో అఆ ఇఈ నేర్చుకుంటా..అంటూ సిరివెన్నెల రాసిన ఆ పాట ఆబాలగోపాలాన్ని అలరించింది. 1990 సెప్టెంబర్ 24న విడుదలైన బొబ్బిలి రాజా సూపర్ హిట్ కావడం, బలపం పట్టి..పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో సీతారామశాస్త్రి సినీ జీవితంలో అసలు వెన్నెల మొలైంది. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. 2021 నవంబర్ 30న అస్తమించే వరకు 35 ఏళ్ల పాటు ఆయన సినీ ప్రయాణం అప్రతిహతంగా సాగింది. ఈ విశేషాలు సిరివెన్నెల కుమారుడు, సంగీత దర్శకుడు యోగీశ్వర శర్మ ఒక ఇంటర్వూలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News