Friday, March 29, 2024

బోర్డు సెక్రటరీ, సభ్యులకు సిట్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో సంచలనంగా మారిన టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో బోర్డు చైర్మన్, సభ్యులను కూడా ప్రశ్నించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయించుకుంది. బోర్డు సెక్రెటరీ, సభ్యులకు సిట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై టిఎస్‌పిఎస్‌సి మెంబర్లను విచారించనుంది. ఈ విచారణలో ఆరుగురు బోర్డు సభ్యుల స్టేట్‌మెంట్ సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. బోర్డు సభ్యులు సుమిత్రా ఆనంద్ తనోబా, కరమ రవిందర్ రెడ్డి, ఆర్ సత్యనారయణ, రమావత్ ధన్ సింగ్, బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారిలను సిట్ విచారించే అవకాశం ఉంది. బోర్డు సెక్రటరీ అనితా రామచంద్రన్‌కు కూడా నోటీసులు జారీ చేశారని సమాచారం. ఎ1గా ఉన్న ప్రవీణ్ అనితా రామచంద్రన్ పిఎగా పని చేస్తున్నారు. టిఎస్‌పిఎస్‌సి సభ్యులను ప్రశ్నించాలని సిట్ అధికారులు భావిస్తున్న క్రమంలో కమిషన్‌లో సభ్యుల పాత్ర, పరీక్షల నిర్వహణలో వాళ్ల నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనే వివరాలు తెలుసుకునేందుకు సిట్ బృందం ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఒక్కొక్కరిని ప్రశ్నించాలనే యోచనలో అధికారులు ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్, కార్యదర్శి నుంచి సిట్ అధికారులు పలు వివరాలు సేకరించారు. వివిధ ఉద్యోగ నియామక పరీక్షలను ఏ విధంగా నిర్వహిస్తారు? ప్రశ్నాపత్రాలు ఎవరు రూపొందిస్తారు? వాటిని ఎక్కడ భద్రపరుస్తారు? ఎవరెవరి ఆధీనంలో ప్రశ్నాపత్రాలుంటాయి? అనే వివరాలను తెలుసుకుని నమోదు చేసుకున్నారని అంటున్నారు. మరోవైపు టిఎస్‌పిఎస్‌సి పరిపాలనా విభాగం సహాయ కార్యదర్శి సత్యనారాయణతో పాటు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర లక్ష్మిని ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సాక్ష్యులుగా చేర్చారు.
అదే క్రమ ంలో గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీలో నిందితులుగా ఉన్న ఇద్దరు టిఎస్‌పిఎస్‌సి ఉద్యోగులు షమీమ్, రమేశ్‌తో పాటు మాజీ ఉద్యోగి సురేశ్‌లను విచారించి పేపర్ లీకేజీతో ఇంకా ఎంత మందికి సంబంధం ఉందనే విషయాన్ని తేల్చాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో నిందితులను 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ముగ్గురు నిందితులు షమీమ్, రమేశ్, సురేశ్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తమతో ఉన్న పరిచయం కొద్దీ ప్రవీణ్ ప్రశ్నపత్రం ఇచ్చాడని, దాన్ని వాటాస్ప్‌లో షేర్ చేశాడని, తాము ఇతరులెవరికీ ఇవ్వలేదని షమీమ్, సురేశ్‌లు సమాధానం చెప్పినట్లు తెలిసింది. రాజశేఖర్‌తో ఉన్న స్నేహం కారణంగానే తనకు ప్రశ్నపత్రం ఇచ్చాడని రమేశ్ చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఎఇ పేపర్లు 12 మందికి, గ్రూప్-1 పేపర్లు ఐదుగురికి లీకైనట్లు ప్రాథమికంగా నిర్థారించినట్లు తెలిసింది.

ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 15కు చేరింది. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌రెడ్డితో కలిసి నిందితుల సంఖ్య 16కు చేరింది. లీకేజీ విషయం టిఎస్‌పిఎస్‌సిలో ఇంకా ఎంతమంది ఉద్యోగులకు తెలుసన్న కోణంలో సిట్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఎఇ పేపర్ లీకేజీకి సంబంధించిన నలుగురు నిందితుల కస్టడీ మంగళవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. వారిని విచారించిన క్రమంలో పలు ఆసక్తికర విషయాలు తెలిసినట్లు సమాచారం. పేపర్‌ను కొన్న వారంతా అప్పులు చేసి, ఆస్తులు కుదువ పెట్టి రేణుక భర్త ఢాక్యా నాయక్, ఆమె తమ్ముడు రాజేశ్వర్‌కు డబ్బులిచ్చామని చెప్పినట్లు తెలిసింది. మరో వైపు ఈ పేపర్ల లీకేజీ కేసులో సిట్ ఎటూ తేల్చడం లేదని, నిందితుల్ని కాపాడేందుకే ప్రయత్నిస్తోందని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.
నివేదికను ఎవరికీ లీక్ చేయలేదు : సిట్
అయితే తమ నివేదికను నేరుగా కోర్టుకే సమర్పిస్తామని, ఎవరికీ లీక్ చేయలేదని సిట్ స్పష్టం చేసింది. బండి సంజయ్‌కు జారీ చేసిన నోటీసుల అంశంపై సిట్ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదు. రెండు సార్లు నోటీసులు జారీ చేసినా బండి సంజయ్ విచారణకు హాజరు కాలేదు.
ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మొత్తం 15 ప్రశ్నపత్రాలు!
అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. సిట్ గుర్తించిన ప్రశ్నపత్రాల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఇఇ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పేపర్లు, డిఎఒ జనరల్ స్టడీస్, మ్యాథ్స్ పేపర్లు, ఎఇ జనరల్ స్టడీస్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పేపర్లు, ఎఇ సివిల్, ఎలక్ట్రికల్ పేపర్ 2, టౌన్ ప్లానింగ్ పరీక్ష పేపర్లు ఉన్నాయి. అదేవిధంగా జులైలో జరగాల్సిన జేఎల్ ప్రశ్నపత్రాలు సదరు పెన్‌డ్రైవ్‌లో లభ్యమయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. లక్షల రూపాయల డబ్బు చేతులు మారినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. రాష్ట్రంలో ’గ్రూప్-1’ ప్రిలిమ్స్ సహా పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటైన ’సిట్’ చేపట్టిన దర్యాప్తులో పలు కీలక ఆధారాలు లభించాయి.

టిఎస్‌పిఎస్‌సి మొత్తం ఏడు పరీక్షలు నిర్వహించగా వాటిలో అయిదు ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు నిర్ధారణ అయింది. వీటన్నింటికి సంబంధించిన లావాదేవీల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కమిషన్ కార్యదర్శి వద్ద పిఎగా పనిచేస్తున్న ప్రవీణ్ తన స్నేహితురాలు రేణుకకు ఎఇ ప్రశ్నపత్రం ఇచ్చి ప్రతిఫలంగా రూ.10 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. రేణుక, ఆమె భర్త డాక్యానాయక్‌లు దీన్ని మరో అయిదుగురికి అమ్ముకొని దాదాపు రూ.25 లక్షల వరకూ వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకొందరికీ ప్రశ్నపత్రం అమ్ముకొని ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రూప్-1 ప్రశ్నపత్రానికి సంబంధించిన లావాదేవీల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News