Friday, April 26, 2024

తెగిపడిన కరెంట్ వైర్…. 6 బర్రెలు మృతి

- Advertisement -
- Advertisement -

రోడ్డుపై వెళ్తున్న పశువులపై తెగిపడ్డ విద్యుత్ వైర్లు
6 బర్రెలు మృతి
సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్
లైన్‌మెన్ రవి సస్పెన్షన్

Six buffaloes dead in current shock
మనతెలంగాణ/ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లిలో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తెగిపోవడంతో ఆరు బర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… గురువారం ఉదయం పూట ఇంటిలో నుండి వదిలిపెట్టిన బర్రెలు మేత కోసం రోడ్డుపై నడిచి వెళ్తుండగా గ్రామంలోని పుట్ట వీరయ్య ఇంటి మూలమలుపు వద్ద కరెంట్ వైరు ఆకస్మాత్తుగా తెగిపడింది. అనూహ్యంగా జరిగిన ఈ సంఘటనతో ఆరు బర్రెలు విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాయి. బుర్ర రాజయ్య, కొమిరిశెట్టి లచ్చయ్య, బుర్ర మల్లయ్య, ఆకులు శ్రీనివాస్, మాచర్ల శంకరయ్య, దీటి లక్ష్మయ్యకు చెందిన బర్రెలు మృతి చెందగా వీటి విలువ సుమారు రూ. 3 లక్షల వరకు ఉంటుంది. సంఘటన జరిగిన సమయంలో రోడ్డుపై జనం లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. మృతి చెందిన బర్రెలు ఆరు కుటుంబాలకు ఉపాధి మార్గంగా ఉంటూ కుటుంబ పోషణకు సహకారం అందిస్తుండగా బర్రెల మృతితో మహిళల రోదనలు మిన్నంటాయి.

తమ కుటుంబాలకు అసరాగా ఉండే బర్రెలు విద్యుత్ షాక్‌తో మృతి చెందడం యజమాని కుటుంబాల్లో విషాదం నింపింది. విద్యుత్ లైన్‌మెన్ రవి నిర్లక్ష్యం మూలంగా ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో ప్రతి విద్యుత్ వైర్‌ను సరిచేసి వర్షాకాలనికి ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పదే పదే చెప్తున్నామని లైన్‌మెన్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమైందని గ్రామస్థులు మండిపడుతున్నారు. సమాచారం అందగానే తెలంగాణ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించి బాధితులతో మాట్లాడారు. వెంటనే జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణకి ఫోన్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు లైన్‌మెన్ రవిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఆర్‌డిఒ శంకర్‌కుమార్, తాహాసిల్దార్ ఆర్ వెంకటలక్ష్మి, మార్కెట్ కమిటి చైర్మన్ గుర్రం మోహన్‌రెడ్డి, మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షులు పాకాల రాజన్నగౌడ్, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షులు పూస్కూరి జితేందర్‌రావు, రైతు సమితి జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎంపిటిసి దాడి సదయ్య, మార్కెట్ డైరెక్టర్ దిటి శ్రీనివాస్, నాయకులు ఆడువాల రవి, మాజీ సర్పంచ్ ఆవుల మల్లయ్య, ఆవుల ఎల్లయ్య, గ్రామప్రజలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News