దుర్ఘటనలో ఆరుగురు వలస కూలీలు దుర్మరణం
ఓఆర్ఆర్పై కూలీల ట్రక్కును ఢీకొట్టిన లారీ, బాధితులు కర్నాటక వాసులు
మన తెలంగాణ/శంషాబాద్ : రోడ్డుపై వెళ్తున్న బొలేరో ట్రక్ను వెనుక నుంచి వ చ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్ర క్ డ్రైవర్తో సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. శంషాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం… కరోనా ప్రభావంతో తెలంగాణలో పనులు లేక కర్నాటక ప్రాంతానికి చెందిన కూలీలు తమ సొంత గ్రామం రాయచూర్కు ట్రక్లో బయలుదేరారు. పెద్ద గోల్కొండ సమీపానికి రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ ట్రక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఒఆర్ఆర్ సిబ్బంది మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో ఎం. చింటు (45), ఎం. రంగప్ప (35), ఎం. అమ్రీష్ (౩౦), ఎఫ్. బసమ్మ(35), సిరియమ్మ(9), బి హనుమంతప్ప ఉన్నారు. ప్రమాద సమయంలో ట్రక్లో 30 మంది కూలీలు ఉన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ గుజరాత్కు చెందినదిగా గుర్తించారు. ఎపిలోని కృష్ణా జిల్లా నూజివీడు నుంచి మామిడికాయల లోడుతో ఈ లారీ వెళుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని వారు చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారు వెల్లడించారు.