హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన ఆరుగురు టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికయినట్టు గెలుపు ధ్రువీకరణ పత్రాలు తీసుకున్న తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండా ప్రకాష్, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, వెంకట్రామి రెడ్డి, కౌశిక్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు.
ఆరు ఎమ్మెల్సీలూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యామని, తమకు అవకాశం ఇచ్చినందుకు సిఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు ఉందని, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ సిఎం కెసిఆర్ నేతృత్వంలో చిత్తశుద్ది పని చేస్తామని, టిర్ఎస్ ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు కెసిఆర్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
ఎదుగుతున్న తెలంగాణను ఓర్వలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుందన్నారు. మోడీ, బిజెపి అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అయిందని, ఈ ఏడేళ్లలో దేశ జిడిపి భారీగా తగ్గిందన్నారు.
కరోన సమయంలో మైనస్ కి జిడిపి వెళ్లిందని, నరేంద్ర మోడీ గొప్ప పరిపాలన దక్షుడు అయితే దేశ జిడిపి ఎలా తగ్గిందో రాష్ట్ర బిజెపి నేతలు చెప్పాలని నిలదీశారు. ధాన్యం సేకరణ అనేది కేంద్రం పరిధిలోని అంశమని, కానీ కేంద్రం కొనటం లేదన్నారు.
- Advertisement -