ఐటి కంపెనీలకు పిలుపు
జాప్యంలేకుండా ఏప్రిల్ 1న జీతాలు
జిహెచ్ఎంసిలో కంట్రోల్ రూం ఏర్పాటు
ఐలాలకు పారిశుధ్య పనుల బాధ్యతలు
హోం క్వారైంటైన్లోని పౌరులపైన నిఘా
అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశాలు
మనతెలంగాణ / హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ కోసం ఏకీకృతమైన సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ)తో నిధులను ఉపయోగించేందుకు ముందుకు రావాలని కంపెనీలను పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. ఈ నిధులను కరుణ వైరస్ నియంత్రణ కోసం ఉపయోగించేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. మున్సిపల్ సిబ్బందికి, ఉద్యోగులకు ఏప్రిల్ 1వ తేదీనాటికి జాప్యం చేయకుండా వేతనం విడుదల చేయాలని, వారి హాజరు పట్టికతో సంబంధం లేకుండా ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా అందించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ప్రత్యేక మార్గనిర్దేశకాలను అన్ని మున్సిపాలిటీలకు జారీచేశారు. మున్సిపాలిటీ కార్యాలయాల ప్రవేశం ద్వారాల వద్ద శానిటైజర్లు లేదా చేతులను శుభ్రం చేసుకునే సదుపాయాలను కల్పించుకోవాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణకు వచ్చే వారి విధిగా చాట్ను రూపొందించి, వర్క్ షెడ్యూల్ను ఈ నెల 31 వరకు రూపొందించుకోవాలని మంత్రి కెటిఆర్ తెలిపారు.
జిహెచ్ఎంసి పరిధిలో…
జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూంను నెలకొల్పి, అన్ని విభాగాలు పోలీసు, రెవెన్యూ, ఫైర్, విద్యుత్, నీటి సరఫరా, తూనికలు కొలతలు, ఎక్సైజ్ వంటి విభాగాల నుంచి వినతులను స్వీకరించేందుకు ఈ కంట్రోల్ రూం పనిచేయాలని మంత్రి కెటిఆర్ చెప్పారు. కంట్రోల్ రూం నెంబర్ను పౌరులందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని చెప్పారు. 24/7 ప్రాతిపదికన కంట్రోల్ రూంలో సేవలందించేందుకు షిప్టులువారిగా విధులను కేటాయించాలని మంత్రి కెటిఆర్ తెలిపారు. కూరగాయలు, వారాంతపుసంతలు, చికెన్, మాంసపు దుకాణాలు, పాల బూత్ల వద్ద ప్రత్యేకంగా పారిశుధ్య పనులు కచ్చితంగా జరగాలన్నారు. భవన నిర్మాణ కార్మికులు, మురికివాడల ప్రాంతాల్లో ప్రత్యేకంగా పరిశుభ్రత ఉండేలా చూడాలని, నగరంలో అన్ని పార్కులను మూసివేయాలని మంత్రి కెటిఆర్ సూచించారు.
మెట్రో మాల్స్ మూసివేయాలి
మెట్రో రైళ్ళు పూర్తిగా బంద్లో ఉన్నాయి. మెట్రో స్టేషన్లోకి ఎవరినీ అనుమతించరాదు. మెట్రో స్టేషన్లోని మాల్స్, షాప్లు, వ్యాపార కార్యకలాపాలను మూసివేయాలని సూచించారు. జలమండలి ఆధ్వర్యంలో నీటి సరఫరా, మురుగుపారుదల విషయంలో ఎలాంటి అవరోధాలు రాకుండా చూడాలన్నారు. జోన్, సర్కిల్, వార్డుల వారిగా తనిఖీలు చేసే బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సెల్ఫ్ ఐసోలేషన్ ఉన్నవారు నియమాలను అతిక్రమిస్తే జరిమానాలు, కేసులు నమోదు చేయాలనీ, ఇల్లు లేని వారిని అయా పట్టణాల్లోని నైట్ షెల్టర్లకు తరలించాలని మంత్రి కెటిఆర్ సూచించారు.
పురపాలక శాఖ తో పాటు పరిశ్రమలు మరియు ఐటీ శాఖాధికారులతోనూ మాట్లాడిన మంత్రి తారక రామారావు, పారిశ్రామిక వాడలు మరియు ఐటీ పార్కుల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులను కొనసాగిస్తూ, పారిశుద్ద్యానికి మరిం త ప్రాధాన్యత ఇవ్వాలని అదేశించారు. స్థానిక ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీలు (ఐలాలు-) దీని భాత్యతను తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ మేరకు టియస్ ఐఐసి అధికారులుఅధికారులు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలన్నా రు. పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్న కాంట్రా క్టు మరియు రోజూవారీ కూలీల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.