అమెరికా రోచెస్టర్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి
వాషింగ్టన్ : తరచుగా సీజనల్గా గతంలో జలుబు వచ్చిన వారికి కరోనా నుంచి కొంత రక్షణ పొందే అవకాశం ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాధికి సంబంధించిన నిరోధక శక్తి జీవితాంతం ఉండవచ్చని అధ్యయనం వివరించింది. జర్నల్ ఎం బయోలో వెలువడిన ఈ అధ్యయనం లో వ్యాధినిరోధక శక్తిలో సుదీర్ఘకాలం కొనసాగే, అంటువ్యాధులను గుర్తించ గలిగే మెమరీ బి కణాలను సార్స్కొవి2 ప్రేరేపిస్తుందని మొట్టమొదటి సారి శాస్త్రవేత్తలు చెప్పగలిగారు. ఈ మెమరీ బి కణాలు వ్యాధికారకాలను నాశనం చేయడానికి యాంటీబాడీలను సృష్టించడమే కాక, భవిష్యత్ కాలంలో కూడా ఆయా వ్యాధికారకాలను గుర్తు పెట్టుకుంటాయని శాస్త్రవేత్తలు వివరించారు.
తరువాత కాలంలో వ్యాధికారకం శరీరంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తిస్తే మెమరీ బి కణాలు వేగంగా చర్యకు పూనుకుని వ్యాధి మొదలు కాక ముందే దాన్ని పూర్తిగా తుడిచిపెడుతుందని అమెరికా లోని యూనివర్శిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మెమరీ బి కణాలు దశాబ్దాల కాలం వరకు బతికి ఉంటాయి కాబట్టి, అవి కరోనా నుంచి కోలుకున్న వారిని తరువాత సంక్రమించే అంటువ్యాధుల నుంచి చాలాకాలం రక్షించ గలుగుతాయని, అయితే తదుపరి పరిశోధన దీన్ని నిర్ధారిస్తుందని శాస్త్రవేత్తల వివరించారు. వ్యాధి నిరోధక వ్యవస్థకు చెందిన బి కణాలకు వ్యాధి కారకాలకు మధ్య జరిగే క్రియాశీల చర్యలను కూడా ఈ అధ్యయనం మొట్టమొదటి సారి చెప్పగలిగింది.
జలుబుకు కారణమైన కరోనా వైరస్లపై బి కణాలు ఒక సారి దాడి చేస్తే, సార్స్ కొవి 2 వైరస్ను కూడా అవి గుర్తిస్తాయని అధ్యయనం వివరించింది. దీన్ని బట్టి ఎవరైనా సాధారణ కరోనావైరస్కు గురైతే వారిలో కొవిడ్ 19 ను ఎదుర్కొనే ఇదివరకటి వ్యాధి నిరోధక శక్తి కొంతవరకైనా ఉంటుందని శాస్త్రవేత్తలు వివరించారు. ఈమేరకు కొవిడ్ 19 నుంచి కోలుకున్న కొంతమంది రక్త నమూనాలు పరిశీలించగా, వారిలో చాలామందికి ముందునుంచి ఉండే మెమరీ బి కణాల నిధి కనిపించిందని, ఇవి వేగంగా సార్స్ కొవి 2 ను గుర్తించి దానిపై దాడికి మరింత వేగంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంటాయని ప్రొఫెసర్ మార్క్ సాంగ్స్టర్ చెప్పారు. తేలిక పాటి లక్షణాల కొవిడ్19 నుంచి కోలుకున్న 26 మంది రక్త నమూనాలతో ఆరోగ్యవంతులైన 21 మంది రక్త దాతల రక్తనమూనాలతో పోల్చి చూఢ గలిగారు.