న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాలను భారత్కు సరఫరా చేయడంలో ఆలస్యమేమీ ఉండదని ఫ్రాన్స్ రాయబారి ఎమాన్యుయెల్ లెనెయిన్ తెలిపారు. భారత వైమానిక దళానికి వీలైనంత త్వరగా నాలుగు రాఫెల్ జెట్లను అందిస్తామని ఆయన అన్నారు. షెడ్యూల్ ప్రకారం అందించలేకపోవడానికి ప్రత్యేక కారణాలేమీ లేవని ఆయన అన్నారు. అయితే, కోవిడ్19 వల్ల బాధపడుతున్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటన్నది గమనార్హం.
ఆ దేశంలో ఇప్పటికే కరోనా వల్ల 28,330 మంది మృతి చెందారు. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ జెట్లను కొనుగోలు చేయడానికి 2016 సెప్టెంబర్లో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం విలువ రూ.58,000 కోట్లు. మొదటి రాఫెల్ జెట్ను రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ గతేడాది అక్టోబర్ 8న ఫ్రాన్స్లోని వైమానిక స్థావరంలో అందుకున్నారు. రాఫెల్ జెట్లను హర్యానాలోని అంబాలా, బెంగాల్లోని హసిమారా వైమానిక స్థావరాల్లో మోహరించనున్నారు. ఇప్పటికే ఈ స్థావరాల్లో రాఫెల్ జెట్ల కోసం రూ.400 కోట్ల ఖర్చుతో మౌలిక వసతుల్ని సిద్ధం చేశారు. భారత పైలట్లకు శిక్షణ కూడా పూర్తయింది.