డిశ్చార్జ్ పిటిషన్కు ప్రత్యేక కోర్టు ఆమోదం
ముంబయి: మహారాష్ట్ర సదన్ కుంభకోణం కేసులో తమ పేర్లను తొలగించాలని కోరుతూ మహారాష్ట్ర మంత్రి, ఎన్సిపి సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్బల్, మరో ఏడుగురు దాఖలు చేసిన పిటిషన్ను ప్రత్యేక కోర్టు గురువారం ఆమోదించింది. భుజబల్తోపాటు ఆయన కుమారుడు పంకజ్, మేనల్లుడు సమీర్, మరో ఐదుగురి పేర్లను ఈ కేసులో నుంచి తొలగించడానికి కోర్టు అనుమతించింది. ఎసిబి నమోదు చేసిన ఈ కేసులో తమను ప్రాసిక్యూట్ చేయడానికి తగిన ఆధారాలు ఏవీ లేవని వీరు తమ పిటిషన్లో పేర్కొన్నారు. 2005-2006లో ఛగన్ భుజబల్ పిడబ్లుడి మంత్రిగా ఉన్నపుడు ఢిల్లీలో మహారాష్ట్ర సదన్ నిర్మించే కాంట్రాక్టును కెఎస్ చమన్కర్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీకి అప్పగించి పెద్ద మొత్తంలో ముడుపులు పొందారని అప్పట్లో ఎసిబి కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20 శాతం మాత్రమే లాభం పొందవలసిన కాంట్రాక్టర్ ఈ ఒప్పందంలో మాత్రం 80 శాతం లాభాలు పొందారంటూ ఎసిబి భుజ్బల్, ఇతరులపై దాదాపు 1000 పేజీల చార్జ్షీట్ దాఖలు చేసింది.