9 వర్శిటీలకు నియామకం కానున్న వైస్చాన్సలర్లు ప్రక్రియ వేగవంతానికి సిఎం ఆదేశాలు
ముందుగా ఇసి సభ్యుల నియామకం చేపట్టాలి, రెండు, మూడు వారాల్లో ప్రక్రియ పూర్తికావాలని స్పష్టం చేసిన కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సలర్ల నియామకంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విసిల నియామక ప్రక్రియ పూర్వరంగంలో, సెర్చ్ కమిటీ నుంచి పేర్లు తెప్పించుకుని ముం దుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల నియామకాలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. దీనివల్ల వైస్ ఛాన్స్లర్ల నియామ క ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రెండు-మూడు వారాల్లోనే ఇదంతా జరగాలని సిఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వివిధ వర్సిటీ ల వైస్ ఛాన్స్లర్ల పదవీకాలం ముగిసిన తర్వాత కొత్త విసి ల నియామకానికి గత ఏడాది జూలై 9న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆ తర్వాత సెప్టెంబరు 20వ తేదీన అన్ని వర్సిటీల విసిల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను ఏ ర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యా శాఖ పరిధిలో 11 వర్సిటీలున్నాయి. వీటిలో జెఎన్ఏఎఫ్యు త ప్ప మిగిలిన10 వర్సిటీల విసిల కాలపరిమితి జులై 24తో ముగిసింది. వీటిల్లోనూ ఆర్జియుకెటి(బాసర ఐఐఐటీ), జెఎన్ఏఎఫ్యు మినహా మిగిలిన వర్సిటీల్లో విసిల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 9 వర్సిటీలకు ఏకంగా 984 దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టులకు 273 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి 142, ఉస్మానియా వర్సిటీ 114, జెఎన్టియుహెచ్కు 56, కాకతీయకు 110, శాతవాహనకు 125, మహాత్మాగాంధీకి 124, తెలంగాణ వర్సిటీకి 114, పాలమూరుకు 122, తెలుగు వర్సిటీకి 23 దరఖాస్తులు వచ్చాయి.
సిఎం ఆదేశాలతో గాడిలో పడనున్న వర్సిటీల పాలన
సిఎం ఆదేశాలతో రెండు వారాలలోనే తొమ్మిది యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్స్లర్లు నియామకం కానున్నారు. పాలకమండళ్లతోపాటు వైస్ ఛాన్స్లర్ల నియామకం పూర్తయితే యూనివర్సిటీలలో పాలన గాడిలో పడనుంది. కొంతకాలంగా ఐఎఎస్లు యూనివర్సిటీలకు తాత్కాలిక విసిలుగా కొనసాగుతున్నారు. వారంతా తమ సొంత విభాగాల్లో చాలా బిజీగా ఉండటంతో వర్సిటీల్లో బాధ్యతల్లో పూర్తి సమయాన్ని వెచ్చించలేకపోతున్నారు. వర్సిటీల సిబ్బంది చిన్నపనికి సైతం వారున్న చోటుకు ఫైళ్లతో పరుగులు తీయాల్సి వస్తోంది.
సొంత ప్రొఫెసర్లతో వ్యవహారాలు నడపడంలో అలవాటు పడ్డ అధికారులు ఐఎఎస్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉస్మానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీలకు సీనియర్ ఐఎఎస్ అధికారి అరవింద్కుమార్ను ఇంచార్జి విసిగా కొనసాతుతుండగా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ తెలుగు యూనివర్సిటీకి , తెలంగాణ యూనివర్సిటీకి నియమించారు. సి.పార్థసారధిని అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి, జయేష్రంజన్ను జెఎన్టియుహెచ్కు, జనార్ధన్రెడ్డిని కాకతీయ వర్సిటీకి, రాహుల్ బొజ్జను పాలమూరు వర్సిటీకి ఇంఛార్జ్ విసిలుగా కొనసాగుతున్నారు.