బెయిర్స్టో మెరుపులు, రాణించిన బౌలర్లు
హైదరాబాద్ భారీ విజయం
దుబాయి: ఐపిఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ మూడో విజయం సాధించింది. గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 69 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరున సాధించింది. తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 16.5 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవి చూసింది. నికోలస్ పురాన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన పురాన్ 37 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో ఐదు ఫోర్లతో 77 పరుగులు సాధించాడు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ మూడు, నటరాజన్, ఖలీల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
బెయిర్స్టో విధ్వంసం
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో శుభారంభం అందించారు. ఇద్దరు ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. వార్నర్ కాస్త సమన్వయంతో ఆడగా బెయిర్ స్టో మాత్రం విధ్వంసక బ్యాటింగ్ను కనబరిచాడు. పంజాబ్ బౌలర్లను హడలెత్తిస్తూ స్కోరును పరిగెత్తించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. భీకర ఫామ్లో ఉన్న బెయిర్ స్టో ఈసారి కూడా మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. చూడచక్కని షాట్లతో కనువిందు చేశాడు. మరోవైపు వార్నర్ మాత్రం భారీ షాట్ల జోలికి వెళ్లకుండా జాగ్రత్త వహించాడు. ఎక్కువ సేపు బెయిర్ స్టోకు స్ట్రయిక్ లభించేలా చూశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్ 40 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్స్త 52 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే క్రమంలో 160 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు. ఇక ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన బెయిర్ స్టో తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 55 బంతుల్లో ఏడు ఫోర్లు, మరో ఆరు సిక్సర్లతో 97 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో ఔటయ్యాడు. కాగా, రవి ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో సన్రైజర్స్ స్కోరు వేగం నెమ్మదించింది. అయితే చివర్లో విలియమ్సన్ (20), అభిషేక్ శర్మ (12) దూకుడుగా ఆడడంతో హైదరాబాద్ స్కోరు ఆరు వికెట్లకు 201 పరుగులకు చేరింది.
SRH Won by 69 Runs Against KXIP