Friday, March 29, 2024

పాకిస్థాన్‌లో పిండి కోసం తొక్కిసలాట: ఒకరు మృతి!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని మీర్‌పుర్‌ఖాస్ జిల్లాలో సబ్సిడీ పిండి కోసం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురి పిల్లల తండ్రి చనిపోయాడు. గులిస్థాన్‌ఈబల్దియా పార్క్ వద్ద 200 బ్యాగుల పిండి అమ్మడానికి రెండు మినీ ట్రక్కులు వచ్చాయి. కమిషనర్ కార్యాలయం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ 10 కిలోల పిండి బ్యాగును రూ. 65కు సబ్సిడీ ధరలో అమ్ముతున్నారు. దాని కోసం ప్రజలు ఒకరినొక్కరు తోసుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం ఈ తొక్కిసలాటలో 40 ఏళ్ల కార్మికుడు హర్సింగ్ కొల్హి రోడ్డు మీద పడిపోయాడు. జనం కాళ్ల కింద నలిగిపోయాడు. తొక్కిసలాట ఎలా మొదలయిందన్నది ఇప్పటికీ తెలియరాలేదు. ఫుడ్ డిపార్ట్‌మెంట్ అధికారుల మీద చర్య తీసుకోవాలంటూ కొల్హి కుటుంబం మీర్‌పుర్‌ఖాస్ ప్రెస్ క్లబ్ వద్ద బైఠాయించారు. చర్య తీసుకుంటామని వారికి పోలీసులు హామీ ఇచ్చి పంపించేశారు. కానీ ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదని తెలిసింది.

సింధ్ ప్రాంతంలో ఇలా సబ్సిడీ బియ్యం అమ్ముతున్న ప్రతీ చోట ఇలాంటి తొక్కిసలాటలే జరుగుతున్నాయని తెలిసింది. షహీద్ బెనజీరాబాద్(నవాబ్‌షా)లోని పిండి మిల్ బయట జరిగిన తొక్కిసలాటలో మైనర్ బాలికకు గాయాలయ్యాయి. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. పాకిస్థాన్‌లో ఉన్న సంక్షోభం కారణంగా అక్కడ పిండి ధరలకు రెక్కలొచ్చాయి. కరాచీలో కిలో పిండి రూ. 140 నుంచి రూ. 160 కు అమ్ముతున్నారు. 10 కిలోల బ్యాగును రూ. 1500కు అమ్ముతున్నారు. క్వెట్టాలోనైతే 20 కిలోల బ్యాగు రూ. 2800 ధర పలుకుతోంది. ఇక బలూచిస్థాన్‌కైతే కావలసిన స్టాకు అందనే లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News