ముంబై: ప్రభుత్వరంగ ఎస్బిఐ కస్టమర్లకు ఊరటనిచ్చింది. ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రుణ రేట్లలో 25 నుంచి 75 బేసిస్ పాయింట్లు కోత విధించింది. ఇప్పటికే మారటోరియంతో సతమతమవుతున్న ఇతర బ్యాంకులకు దిగ్గజం బ్యాంక్ నిర్ణయం మరింత ఒత్తిడిలో పడేయనుంది. మే 27 నుంచి అన్ని రకాల కాలపరిమితులకు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీని తర్వాత తాజాగా ఎస్బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. పెద్ద మొత్తంలో మిగులు నిధుల నిర్వహణ సమస్యను పరిష్కరించేందుకు గాను మే నెలలో రెండు సార్లు బ్యాంక్ డిపాజిట్ రేట్లను తగ్గించింది.
విదేశీ వాణిజ్య రంగంలో భారత్ నష్టపోవచ్చు: ఎస్బిఐ నివేదిక
దేశ ఆర్థిక వృద్ధిలో దీర్ఘకాలిక మందగమనం భారతదేశ విదేశీ వాణిజ్య రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుందని ఎస్బిఐ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్షీణించిన ముడి చమురు ధరల కారణంగా ఈ బాహ్య రంగం సంతృప్తికరమైన స్థితిలో ఉందని సోమవారం విడుదల చేసిన బ్యాంక్ నివేదికలో వెల్లడించింది. ఎస్బిఐ రీసెర్చ్ ఎకోవ్రాప్ నివేదిక ప్రకారం, కరెంట్ అకౌంట్ మిగులుతో భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని ముగించవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగా ఉండి, సంవత్సరంలో వాటిలో ఎటువంటి కదలికలు లేనట్లయితే బాహ్య రంగంలో దేశం స్థానం మెరుగ్గా ఉండవచ్చు. 2020-21 సంవత్సరంలో విదేశీ వాణిజ్య రంగంపై దృష్టిపెట్టాలి. ఎందుకంటే ఆర్థిక వృద్ధిలో దీర్ఘకాలిక మందగమనం విదేశీ వాణిజ్య రంగంపై, అలాగే రూపాయి మారకపు రేటుపై ప్రభావం చూపుతుంది. స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 2016-17లో 8.3 శాతం నుండి 2019-20లో 4.2 శాతానికి తగ్గిందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ 5 శాతం తగ్గుతుందని అంచనా. ఇది మొత్తం ఆర్థిక వృద్ధి రేటులో తొమ్మిది శాతం క్షీణతను సూచిస్తుంది.
State Bank of India lowers MCLR rate by 25 basis points