హైదరాబాద్: రానున్న వేసవిలో రాష్ట్రంలోని ఏ ఒక్క ఆవాసానికి తాగునీటి సమస్య రావొద్దని ఇఎన్సి కృపాకర్రెడ్డి అన్నారు. మార్చి నాటికే మిషన్ భగరీథ తాగునీటి సరఫరా వ్యవస్థపై స్టెబిలైజేషన్ (స్థీరీకరణ) పనులు పూర్తి కావాలన్నారు. తొలిసారిగా హైదరాబాద్ వెలుపల గజ్వేల్… కోమటిబండ మిషన్ భగీరథ నాలెడ్జ్ సెంటర్లో ఆదివారం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కృపాకర్రెడ్డి మాట్లాడుతూ.. మిషన్ భగరీథ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అధికారులు తమ విధులను మరింత బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. ఈ నేపథ్యంలో విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు. అవసరమైతే శాఖరమైన చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఇప్పటికే రాష్ట్రంలోని మెజార్టీ గ్రామీణ ఆవాసాల్లో భగీరథ నీళ్లు ఇంటింటికి నల్లాతో సరఫరా అవుతున్నాయని కృపాకర్రెడ్డి అన్నారు. ఇంకా కొన్ని ఆవాసాల్లో మాత్రమే నీటి సరఫరా అవడం లేదన్నారు. రానున్న మార్చి నాటికి మిగిలిన ఒహెచ్ఆర్ఎస్ నిర్మాణాలను కూడా పూర్తి చేసి పూర్తిస్థాయిలో నీటి సరఫరాను ప్రారంభించాలని ఇఎన్సి సూచించారు. అందుకు తగిన విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని పనిచేయాలన్నారు. ఇంట్రావిలేజ్ పనుల్లో ఖమ్మం, నల్గొండ జిల్లాలు బాగా వెనుకపడ్డాయన్నారు. అక్కడి అధికారులు తీరు మార్చుకోవాలని ఆయన సుతిమెత్తగా మందలించారు. ఎక్కడైతే పనులు పూర్తి, భగీరథ నీళ్లు ఇంటింటికి నల్లాతో సరఫరా అవుతున్నాయో, అక్కడ మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
మిషన్ భగీరథ నీటిని మాత్రమే తాగేలా గ్రామస్థులను చైతన్యపరచాలన్నారు. ఆర్ఒ నీటిని తాగడం వల్ల కలిగే అనర్ధాలను పెద్దఎత్తున ప్రచారం చేయాలని ఆయన సూచించారు. మిషన్ భగీరథతో ప్రజలకు నాణ్యమైన నీటిని సరఫరా చేయడానికి తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులను ఆయన కోరారు. వేసవి కాలంల పూర్తి అయ్యేవరకు సెలవు రోజుల్లో కూడా సమీక్షా సమవేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజనీర్లు విజయ్ప్రకాశ్, చక్రవర్తి, శ్రీనివాస్రావు, శ్రీనివాస్రెడ్డి, కన్సల్టెంట్లు నర్సింగ్రావు, జగన్, మనోహర్బాబు, సురేష్కుమార్, నందారావు, కృష్ణమూర్తితో పాటు అన్ని జిల్లాల ఎస్ఇలు, ఇఇలు పాల్గొన్నారు.