టెల్కోలను ఆదేశించిన సుప్రీం కోర్టు, కేసు విచారణ 18కి వాయిదా
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెల్లించాల్సిన సర్దుబాటు స్థూల ఆదాయం (ఎజిఆర్) చెల్లింపులపై తుది రోడ్మ్యాప్ను దాఖలు చేయాలని సుప్రీం కోర్టు టెల్కోలకు ఆదేశించింది. సమర్పించిన సెక్యూరిటీలతో పాటు చెల్లింపులకు అనుమతి సమయంతో వంటివి అఫిడవిట్లో వెల్లడించాలని కోర్టు కోరింది. ప్రభుత్వ సంస్థలు చేసిన ఎజిఆర్ బకాయిల డిమాండ్ను అంగీకరించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ డిమాండ్ను ఉపసంహరించుకోవాలని టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్)కు సూచించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ సంస్థల నుంచి రూ. 4లక్షల కోట్ల ఎజిఆర్ బకాయిల డిమాండ్ను ప్రశ్నించింది.
తదనంతరం కేసు విచారణను వచ్చే వారానికి(జూన్ 18) వాయిదా వేసింది. ఎజిఆర్ బకాయిలు ఎలా చెల్లించాలో వివరించడానికి అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రైవేటురంగ టెలికాం కంపెనీలను కోర్టు ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేస్తామని డాట్ తరపున కోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. బకాయిల చెల్లింపులకు సంబంధించి ఐదు రోజుల్లోగా అఫిడవిట్లను కోర్టులో ధాఖలు చేయాలని వోడాఫోన్ ఐడియాతో సహా ఇతర టెలి కాం సంస్థలను కోర్టు ఆదేశించింది. టెలికాం కంపెనీలు ఎజిఆర్ బకాయిల రూపంలో కేంద్రానికి రూ.1.47లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇంత మొత్తం లో చెల్లింపులు ఒకేసారి చెల్లించలేమని, కొంత సమయం ఇవ్వాలని, సంస్థలకు లాభాల్లావని టెలికాం సంస్థలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో ఎజిఆర్ బకాయిలను 20 లేదా అంతకు ఎక్కువ కంటే ఎక్కువ సంవత్సరాల్లో వార్షిక వాయిదాల పద్దతిలో చెల్లించే ఫార్ములాకు అనుమతిని కోరుతూ టెలికమ్యూనికేషన్ విభా గం మార్చి 16న సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ గురువారం విచారించిన సుప్రీం కోర్టు ఈ విధంగా ఆదేశాలిచ్చింది. కాగా భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, ఇతర మొబైల్ ఫోన్ కంపెనీలు తమ బకాయిలను సొంతంగా అంచనా వేసినందుకు మే 18న సుప్రీంకోర్టు మందలించింది. వడ్డీ, జరిమానాతో పాటు గత బకాయిలను చెల్లించాలని కోర్టు ఈ సంస్థలను కోరింది. ఈ మొత్తం రూ.1.6 లక్షల కోట్లు. కంపెనీలు తమ బకాయిలను స్వయంగా అంచనా వేయడానికి అనుమతించినందుకు కోర్టు టెలికామ్ శాఖను మందలించింది. 2019 అక్టోబర్ 24న బకాయిలపై ఇచ్చిన తీర్పు చివరిదని కోర్టు స్పష్టం చేసింది.