Thursday, April 25, 2024

అన్నీ అమ్మేశాక ఇంకెక్కడి కోటా!

- Advertisement -
- Advertisement -

Story about scheduled castes- scheduled tribes

స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ వాళ్ళు కనీసం వ్యాపార దృక్పథం కోసమే అయినా వాళ్ళు నిర్మించిన ఓడ, రైలు, చివరకు విమాన సంస్థలు కూడా నేడు దేశంలో అమ్ముడు పోయాయి. రైతులు సాగు చేసుకునే వ్యవసాయ రంగం కూడా అమ్ముడు పోయి మొత్తం దేశ ప్రజలు నిరాదరణకు, పేదరికానికి దగ్గరైన తరుణంలో అసలు ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసి రిజర్వేషన్స్ లేని దేశంలో, రాష్ట్రంలో ఎస్‌సిలను వర్గీకరిస్తామని నమ్మించడం ముమ్మాటికీ మోసమే అవుతుంది. స్వాతంత్య్రం తరువాత 1952 నుండి 1996 వరకు తొలి భారత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కొన్ని వేల ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలు తర్వాత వచ్చిన నేతలు వారి వారి వ్యాపారాలు రాజకీయ అవసరాల నిమిత్తం కొంచెం కొంచెంగా నేడు నూటికి 97 శతం అమ్మేసి కేవలం రిజర్వేషన్స్ లేని న్యాయ సంస్థలు, రక్షణ, ఆర్మీ నూటికి 99 శాతం అగ్రకుల వ్యక్తులు అనుభవిస్తున్న వ్యవస్థలు దేశంలో మిగిలి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బిజెపి కిషన్ రెడ్డి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లాంటి వ్యాపార వేత్తలు రిజర్వేషన్స్ పంచాలని మాట్లాడటం రాజకీయ కుట్రలో భాగమే అవుతుంది. భారత రాజ్యాంగం అమల్లోకి రాక ముందు దేశంలో చదువు పిడికెడు మందికే ఉండేదనే విషయం కనీసం జ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తికీ తెలుసు. 1950 జనవరి 26న దేశ ప్రజలందరికీ కుల మాట వర్గ లింగ భేదం లేకుండా ప్రాథమిక విద్య అమల్లోకి వచ్చింది. అప్పటికి దేశంలోని ఎస్‌సి, ఎస్‌టి, ప్రజలు బిసి ప్రజలు స్త్రీలు చదువలేదు వారికీ ప్రాథమిక విద్యపూర్తి చేసే సరికే 20 యేండ్లు పట్టింది. బాబాసాహెబ్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్‌లు అప్పుడు వాళ్లకు ఉపయోగపడ్డాయి. తర్వాత 1980 నాటికీ కొద్దిగా చదువుకున్న కొంత మంది ఉన్నత విద్యకు వృత్తి విద్యలకు దగ్గరయ్యారు. అయినా సరే ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు అత్యున్నత ఉద్యోగాలు, పదవులు పొందలేరు. కారణం ఆయా రంగాల్లో రిజర్వేషన్ లేక పోవడమే.

1980 నుండి 1990 వరకు దేశంలోని విశ్వవిద్యాలయాల్లో కూడా అప్పుడప్పుడే ఈ కులాల విద్యార్థులు అడుగు పెడుతున్నారు. అది చూసి కళ్ళు మండి హైందవ మతం పేరుతో రాజ్యానికి తిరిగి వచ్చిన పాలకులు ఏకంగా రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు తొలగించాలని తీవ్రంగా ప్రయత్నం చేశారు. చివరికి భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అప్పటి రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ దాన్ని వ్యతిరేకించి దేశ ప్రజాలకు రాజ్యాంగం, అందులోని రిజర్వేషన్స్ నేటికీ కేవలం 5 శాతం మాత్రమే అమలు అవుతున్నాయని రాజ్యాంగాన్ని మార్చితే దేశం నాశనం అవుతున్నదని చాలా స్పష్టంగా రాజకీయ పార్టీలకు, నాయకులకు తెలియ జేశారు. ప్రయివేటీకరణ ప్రపంచీకరణ దేశంలోకి వచ్చినప్పటినుండి ప్రత్యక్షంగా రిజర్వేషన్స్ తొలగించబడ్డాయి. వాటి గురించి మాట్లాడకుండా ఏ మాత్రం సామాజిక అవగాహనా లేకుండా సచ్చిన శవాన్ని బతికిస్తామని ప్రగల్భాలు పలకడం సిగ్గు చేటు.

భారత దేశంలో అమలైన హైందవ సిద్ధాంతం, మానవ సంబంధాలను కట్టడి చేస్తూ ఇనుప కంచెలు వేసి ఎప్పటికీ కలవకూడని ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలు ఎవరైనా అతిక్రమిస్తే దేవుడు చాలా పెద్ద శిక్ష వేస్తాడు కనుక ఒక పని చేసి బతికే మనిషి ఇంకో పని చేసి బతికే మనిషిని కనీసం ముట్టుకునే వీలు లేకుండా దేశాన్ని 6 వేయిల కులాలుగా విభజన చేసి భూమిపైన ఎక్కడ కూడా లేని కులాల కుంపటిని మనువు రగిల్చినాడు. అలాంటి అమానవీయ మానవ సమాజాన్ని బాబా సాహెబ్ డా. బిఆర్ అంబేడ్కర్ సమీకరించి ప్రజల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్య, వైద్య, రాజకీయ, మానసిక అంశాలను లెక్కలోకి తీసుకుని మనువు చేసిన మానవ విభజనను తొలగించి కొన్ని కులాలకు అంటరానితనం ఆధారంగా కొన్ని రాయితీలు కల్పించారు. వాటి పేరు scheduled casts, scheduled tribes. రిజర్వేషన్లు ఆయా ప్రజలకు కేవలం ఇతర కులాల ప్రజలతో కొన్ని అంశాల్లో సమానం కావడానికి, ఆత్మగౌరవంగా జీవించడానికి మాత్రమే ఉపయోగపడతాయని వాళ్ళను కొన్ని ప్రత్యేక షెడ్యూల్‌లో ఉంచి వాళ్ళను బాబా సాహెబ్ షెడ్యూల్డ్, కులాలు షెడ్యూల్డ్ తెగలు అని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ ప్రజల హక్కులు కేంద్రం ప్రత్యేకంగా కాపాడాలని ఈ హక్కులకు భంగం కలిగితే స్వయంగా భారత రాష్ట్రపతి (Presi dent of India) చొరవ తీసుకుంటాడని చాలా స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచి వాటి రక్షణ కోసం ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసుకోవాలని అయన చెప్పారు. నేడు రిజర్వేషన్స్ దేశంలోని అన్ని కులాలకు అందుతున్నాయి. పైగా దేశ జనాభాలో కేవలం 5 శాతం ఉన్న ప్రజలకు నేడు 10 శాతం రిజర్వేషన్ అందుతుంది.

ప్రభుత్వరంగ సంస్థలన్నీ అమ్మేసిన బిజెపి, కాంగ్రెస్‌లు తెలుగు రాష్ట్రాల ఎస్‌సి కులాలకు రిజర్వేషన్స్ పంచాలని చెప్పి పార్లమెంట్‌లో మాట్లాడటం అత్యంత సిగ్గుచేటు. ఏమీ లేని చోట అన్నీ పంచుతామని చెప్పి ప్రజలను తప్పు తోవ పట్టించడమేకాక నేరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సి కులాల్లో కొందరికి రిజర్వేషన్ అమలు చేయడంలో అన్యాయం జరిగిందని ఆనాటి ప్రభుత్వానికి విన్నవిస్తే వాళ్ళు కొన్ని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆగమేఘాల మీద వన్ మాన్ కమిషన్ రామచంద్ర రాజ్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ నివేదిక ఆధారంగా 1999లో తెలుగు రాష్ట్ర ఎస్‌సిలను ఎ, బి, సి, డిలు విభజన చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది ఆనాటి ప్రభుత్వం. దీన్ని వ్యతిరేకిస్తూ అంబేడ్కర్ వాదులు ఇవి చిన్నయ్య , పివి రావ్ లాంటి మేధావులు ఉమ్మడి హైకోరు, ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే అనేక ప్రజా పోరాటాలు నిర్వహించారు. ఫలితంగా నవంబర్ 4, 2005 న దేశంలోని అన్ని కులాల్లో ఉన్నట్లే ఎస్‌సి కులాల్లో కూడా అంతరాలు ఉన్నాయని వాటిని కొన్ని ప్రత్యేక వసతులు సదుపాయాలు కల్పించి రూపుమాపాలని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. అలాగే బాబాసాహెబ్ కలిపిన అంటరాని కులాలను మరింత సూక్ష్మవిభజన చేయడం సాధ్యం కాదని ఒక వేళ అలా చేస్తే అది రిజర్వేషన్ ప్రక్రియకు రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలుగుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 340, 341, 342 లను నాశనం చేస్తుందని స్వయంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది.

దాని పైన మళ్లీ పాలకులు ఉష మెహ్రా కమిషన్ వేశారు. ఏ కమిషన్ కూడా ఎస్‌సిలను వర్గీకరణ చేయాలనీ చెప్పలేదు. అయినా సరే పాలక పార్టీలు వర్గీకరణ కావాల్సిందేనని మాట్లాడుతూ మాదిగలను తీవ్రంగా మోసం చేస్తున్నారు. రిజర్వేషన్స్ అమలు చేయాల్సి వస్తుందని విద్య, ఉద్యోగ రంగాల్లో ఎస్‌సిలు, ఎస్‌టిలు ఎదిగితే తమ రాజకీయ పదవులకు, పాలనకు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుందని ముందే గ్రహించిన పాలకులు 1996 నుండే ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు అమ్ముతూ మరో పక్క ఎస్‌సిలను వర్గీకరించాలని పార్లమెంట్, అసెంబ్లీలో మాట్లాడటం రాజ్యాంగాన్ని, న్యాయ స్థానాలను అగౌరవ పరచడమే అవుతుంది. నేటికీ 298 పబ్లిక్ సెక్టార్ సంస్థలను అమ్మేసిన పాలకులు ఎక్కడ రిజర్వేషన్స్ అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలి. అలాగే విద్యను, ఉద్యోగాలను శాశ్వతంగా లేకుండా జాగ్రత్త పడుతూ అంటరాని కులాలకు అధికారం అందకుండా చేయడంలో విజయం సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగం అమలైనప్పటి నుండి నేటికీ కేవలం రెండు లేదా మూడు కులాలు మాత్రమే పాలిస్తున్నాయి.

ఒక్కసారి మాత్రమే దామోదరం సంజీవయ్యను తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యంమత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన కులం ఒత్తిళ్లు తట్టుకోలేక ఆయనకు మధ్యలోనే ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించింది. ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయం నేడు లక్షలాది మంది గూడులేని పేద ప్రజలకు హైదరాబాద్‌లో గూడు నిచ్చింది. ఇతర కులాల నాయకులు ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి అమ్ముకొని కోట్లు కూడబెడితే దామోదరం ప్రభుత్వ భూములను ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించారనేది అక్షర సత్యం. రాష్ట్రాల విభజన జరిగితే ఎస్‌సిలు అధికారంలోకి వస్తారని ఆశిస్తే తిరిగి అగ్రకుల పార్టీలు, పాలకులు ఎలాంటి ప్రయోజనం లేని, ఎక్కడ ఉపయోగం లేని ఉపయోగపడని ఎస్‌సి రిజర్వేషన్స్ వర్గీకరణ చేస్తామని ఊరిస్తూ సునాయాసంగా వాళ్ళ అధికారం వాళ్ళు పొందుతూ, వారి కులాలను అన్ని రకాలుగా ముందుకు తెచ్చుకుంటూ ఎస్‌సిలను మరింత మోసం చేస్తున్నారు . నిజంగా ఎస్‌సిలపైన ప్రేమ ఉంటే పెరిగిన జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్స్ పెంచాలి. అన్ని ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలి, అన్ని ప్రైవేట్ కంపెనీలలో రిజర్వేషన్స్ అమలు చేయాలి. ఎన్నో సంవత్సరాల నుండి భర్తీ చేయని బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు నింపాలి. అన్నింటికీ మించి దేశంలోని భూమిని బాబా సాహెబ్ సూచించినట్లు ప్రజలకు జాతీయం చేయాలి. అట్లా ప్రజా పోరాటాలు రావాలి ప్రజలు సమానంగా జీవించాలని కోరుతూ… భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.

పబ్బతి శ్రీకృష్ణ
95334 11328
-(మాల మహానాడు
జాతీయ అధ్యక్షుడు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News