Thursday, March 28, 2024

పెరిగిన ధరల ప్రకారం స్కాలర్‌షిప్ రేట్లు పెంచాలి

- Advertisement -
- Advertisement -

బిసి, ఈబిసి విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలి
జాతీయ బిసి సంక్షేమ సంఘం డిమాండ్

మన తెలంగాణ / హైదరాబాద్ : పెరిగిన ధరల ప్రకారం కాలేజీ కోర్సులు చదివే ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థుల స్కాలర్‌షిప్ రేట్లు రూ.5,500 నుంచి రూ.20 వేలకు పెంచాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర బిసి విద్యార్థి సంఘం శుక్రవారం బిసి భవన్‌లో సమావేశమయ్యింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. అంజి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపి ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ కాలేజీ కోర్సులు ఇంజనీరింగ్, డిగ్రీ, పిజి, ఇంటర్ కోర్సులు చదివే విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని, ఫీజుల బకాయిలు రూ.3,300 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.

డిమాండ్ల సాధన కోసం ఈ నెల 24న కాలేజీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి జిల్లా కలెక్టరేట్లు, ఎంఆర్‌ఒ ఆఫీసుల వరకు ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇస్తున్న స్కాలర్‌షిప్‌లు ఐదు సంవత్సరాల క్రితం నిర్ణయించారన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రూ.20 వేలు స్కాలర్‌షిప్ ఇస్తున్నారన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్నట్లుగా బిసి, ఇబిసి విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలన్నారు. మొత్తం ఫీజులు మంజూరు చేస్తే ప్రభుత్వానికి అదనంగా రూ.150 కోట్లు మాత్రమే భారం పడుతుందన్నారు. విద్యార్థుల గత రెండేళ్శ ఫీజు బకాయీలు రూ. 3,500 కోట్లు వెంటనే చెల్లించాలని మొత్తం 15 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. ఈ సమావేశంలో బిసి నాయకులు గుజ్జ కృష్ణ, అనంతయ్య, నీల వెంకటేష్; సుధాకర్, నరసింహగౌడ్, రావుల రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News