హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మానసపుత్రిక హరితహారంలో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఛాలెంజ్’లో మణుగూరు మండలంలోని ఎక్స్లెంట్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ స్కూల్లో ఎక్స్లెంట్ విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ మొహమ్మద్ యాకుబ్ షరీఫ్ మాట్లాడుతూ పెద్దలు చెప్పినట్లు గాలిని, నీరును కొనుక్కునే పరిస్థితి వస్తుందని అన్నారో ఆ విధంగా మన దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటుచేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి దుస్థితి భావితరాలకు రాకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ ‘గ్రీన్ ఛాలెంజ్’లో భాగంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒక్క విద్యార్థి మూడు మొక్కలు నాటి మరో ముగ్గుర్ని మొక్కలు నాటేందుకు నామినేట్ చేయాలని కరస్పాండెంట్ పిలుపునిచ్చారు.
నగరిలో మొక్కలు నాటిన ఎంఎల్ఎ రోజా..
ఎంపి సంతోష్ కుమార్, బిగ్బాస్ షో ఫేమ్ భాను శ్రీ రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ను ఎపి ఎంఎలఎ రోజా స్వీకరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరి పట్టణంలో మహా ర్యాలీ నిర్వహించి పిసిఎన్ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఎంపి సంతోష్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. అందులో తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అందరం మొక్కలు పెంచాలని కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా అందరం తీసుకోవాలని ఎంఎల్ఎ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోజా మొక్కలు పంపిణీ చేశారు.