Saturday, April 20, 2024

డిజిటల్ చదువులు.. ఆన్‌లైన్ బాట పడుతున్న విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

E-school online systems

 

హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లలను డిజిటల్, ఇ-లెర్నింగ్ ఫ్లాట్‌ఫారమ్స్ ద్వారా చదివించుకోవాల్సిందిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. ఈ మేరకు తమ తమ రాష్ట్రాల్లోని విద్యార్ధులకు ఈ సమాచారం అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ఈ డిజిటల్, ఇ-లెర్నింగ్ ఫ్లాట్ ఫార్మ్ అన్నీ ఉచితంగానే లభ్యమవుతాయని స్పష్టం చేసింది.

ఆన్‌లైన్‌లో వేలల్లో పుస్తకాలు
కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ(ఎంహెచ్‌ఆర్‌డి) రూపొందించిన దీక్ష, ఇ పాఠశాల వంటి ఆన్‌లైన్ వ్యవస్థలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని కేంద్రం పేర్కొంది. సిబిఎస్‌ఇ, ఎన్‌సిఇఆర్‌టి ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు రూపొందించిన 80 వేల పుస్తకాలు దీక్ష పోర్టల్‌లోనూ, ఇ పాఠశాలలో 2 వేలకుపైగా ఆడియో, వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి.

ఫాఠశాల విద్య
దీక్ష వెబ్‌సైట్‌లో సిబిఎస్‌ఇ, ఎన్‌సిఇఆర్‌టి, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సిలబస్‌లతో కూడిన పాఠ్యపుస్తకాలు బహుళ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు 80 వేలకు పైగా ఇ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన యాప్‌ను ఐఒఎస్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇతర వివరాలకు ttps://diksha.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఇపాఠశాల వెబ్‌సైట్‌లో ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు బహుళ భాషల్లో 1,886 ఆడియోలు, 2 వేల వీడియోలు, 696 ఇ-బుక్స్, 504 ఫ్లిప్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలకు http://epathshala.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఎన్‌ఆర్‌ఒఇఆర్ పోర్టల్‌లో వివిధ భాషల్లో మొత్తం 14,527 ఫైల్స్ ఉన్నాయి. ఇందులో 401 కలెక్షన్స్, 2,779 డాక్యుమెంట్స్, 1,345 ఇంటరాక్టివ్స్, 1,664 ఆడియోలు, 2,586 ఇమేజెస్, 6,153 వీడియోలు ఉన్నాయి. వెబ్‌సైట్ చిరునామా https://nroer.gov.in/welcome

స్వయం నేషనల్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాంలో తొమ్మిదవ తరగతి నుంచి 12వ తరగతి వరకు గ్రాడ్యుయేషన్, పిజి, ఇంజనీరీంగ్, మానవ వనరులు, సోషల్ సైన్స్, లాకు చెందిన 1,900 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు http://swavam.qov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

పిల్లలు చెడుమార్గాలు పట్టకుండా జాగ్రత్త
ఇంట్లో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఉంటే సాధారణంగా పిల్లలు రెండు మూడు రోజులపాటు పాఠశాలకు సెలవులు పెడతారు. ఆ తర్వాత స్కూల్‌కు వెళ్లమంటే మారాం చేస్తూ ఉంటారు. అలాంటిది అనుకోకుండా రోజుల తరబడి సెలవులు వస్తే గందరగోళమే. టివిలు, స్మార్ట్‌ఫోన్లు, వీడియోగేమ్‌లతో ఎంతో ప్రమాదం పొంచి ఉంటుంది. తాజా వరుస సెలవుల నేపథ్యంలో పిల్లలను గాడిన పెట్టడమంటే కత్తిమీద సవాలే. కరోనా ఆకస్మిక సెలవుల నేపథ్యంలో అప్రమత్తమైన పాఠశాలలు పిల్లలు చెడుమార్గాలు పట్టకుండా జాగ్రత్తపడుతున్నాయి. ఆన్‌లైన్ పాఠాలను ఎంచుకుని పిల్లలకు పాఠ్యాంశాలతో పాటు కొత్త విషయాలను కూడా నేర్పిస్తున్నాయి. ఈ సారి ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు చదువు పట్ల ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పాఠశాలలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.

వాట్సాప్ ద్వారా పది విద్యార్థుల సందేహాల నివృత్తి
పదవ తరగతి పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటివరకు జరిపిన ప్రిపరేషన్ వృథా కాకుండా పాఠశాలలు జాగ్రత్త పడుతున్నాయి. పదవ తరగతికి సంబంధించిన పరీక్షల రీ షెడ్యూల్ వెలువడేంత వరకు విద్యార్థులు నిరంతరం ప్రిపరేషన్ కొనసాగేలా విద్యార్థులను సమాయత్తం చేస్తున్నారు. ప్రస్తుత పోటీ నేపథ్యంలో పది పరీక్షల్లో తమ విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరచాలని పాఠశాలలు సహజంగా కోరుకుంటాయి. ఈ నేపథ్యంలో సంబంధిత టీచర్లు ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు మార్గనిర్ధేశం చేస్తూ వారి సందేహాలను కూడా వాట్సాప్,ఫోన్ల ద్వారా నివృత్తి చేస్తున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో విద్యార్థులు దృష్టి మరలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యార్థులు, టీచర్లూ ఇంట్లో ఉంటూనే అందుబాటులో ఉన్న టెక్నాలజిని అందిపుచ్చుకుంటూ పరీక్షలకు సంసిద్దమవుతున్నారు.

Students use E-school online systems
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News