న్యూఢిల్లీ: బిఎస్ 4 వాహనాలకు సంబంధించి ఇప్పుడు ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లాక్డౌన్ దశలో ఈ వాహనాల విక్రయాలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవల్సి ఉందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అప్పటివరకూ ఈ వాహనాలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలు సాగించరాదని ఉత్తర్వులు వెలువరించింది. ఇంతకు ముందటి తమ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు ఇప్పుడు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ను తీవ్రంగా మందలించింది. గత మార్చి చివరి వారంలో లాక్డౌన్ ఉన్నప్పుడు ఆ తరువాత కూడా జరిగిన బిఎస్ 4 వాహనాల విషయంపై ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించింది. మార్చి 27వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. ఢిల్లీ, ఎన్సిఆర్ మినహాయించి ఇతర చోట్ల లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత పదిరోజుల పాటు ఈ వాహనాలను విక్రయించుకోవచ్చునని తెలిపామని, మరి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో ఈ వాహనాలను ఎలా విక్రయించారని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం తెలిపింది.
Supreme Court ban BS4 Vehicles Registration