కరోనా నేపథ్యంలో పరీక్ష రాయలేని వారిని ‘ఆప్ట్ ఔట్’గానే పరిగణించాలి
ఐసిఎఐకు సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో సిఎ పరీక్షలు రాయాలనుకున్న విద్యార్థులు ఒక వేళ గైరుహాజరయితే వారినికూడా పరీక్షలు రాయకూడదన్న ఆప్షన్ను ఎంచుకున్న వారితో సమానంగా పరిగణించాలని ఈ పరీక్షలను నిర్వహించే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా( ఐసిఎఐ)కి సుప్రీంకోర్టు సూచించింది. జూలై 29, ఆగస్టు 16 మధ్య దేశ వ్యాప్తంగా సిఎ పరీక్షలు జరగాల్సి ఉంది.
దేశంంలో కరోనా ఉధృతి కారణంగా ఈ పరీక్షలు రాయాలో, వద్దో నిర్ణయించుకునే అవకాశాన్ని అభ్యర్థులకు ఈ సంస్థ కల్పించింది. అయితే ఒక వేళ పరీక్షలు రాయాలనుకున్న అభ్యర్థి కరోనా కారణంగా తమ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉండి పరీక్ష రాయలేకపోతే అతడిని కూడా పరీక్షలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న అభ్యర్థులకు ఇచ్చే అన్ని వెసులుబాట్లు వారికి కూడా కల్పించాలని న్యాయమూర్తులు ఎఎం ఖన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఐసిఎఐకి సూచించింది.
మే నెలలో నిర్వహించాల్సిన సిఎ పరీక్షలను కరోనా కారణంగా జూలై చివరినుంచి ఆగస్టు మధ్య లోగా నిర్వహించాలని ఐసిఎఐ నిర్ణయించింది. అయితే ఈ విషయంలో ఆ సంస్థ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తూ దాఖలయిన పిటిషన్పై ధర్మాసనం సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. అలాగే పరీక్ష సెంటర్ మార్చుకునే అవకాశాన్ని పరీక్షల తేదీ చివరి వారం వరకు అభ్యర్థులకు ఇవ్వాలని కూడా బెంచ్ సూచించింది. అంతేకాకుండా సిబిఎస్ఇ లాంటి వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలకు సంబంధించి కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను కూడా ఐసిఎఐ దృష్టిలో పెట్టుకోవాలని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. తదుపరి విచారణను బెంచ్ జూలై 2కు వాయిదా వేసింది.