మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా ఉద్ధృతి దృష్ట్యా పంచాయతీరాజ్ సంస్థల్లోని సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పిటిసి, వార్డుసభ్యుల ఖాళీలకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించరాదని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పిటిసి, వార్డుసభ్యుల ఖాళీలకు ఎన్నికల నిర్వహణపై అధికారులతో మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని పార్థసారథి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 124 సర్పంచ్, 60 ఎంపిటిసి, ఒక జెడ్పిటిసి స్థానంతో పాటు 2,280 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ గత నెల 15తోనే పూర్తి అయింది. అయితే కొవిడ్ విజృంభణ దృష్ట్యా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సరికాదన్న ఉద్దేశంతో వాయిదా వేశారు. పరిస్థితులు చక్కబడ్డాక వైద్యశాఖ అధికారులను సంప్రదించి, ప్రభుత్వ ఆమోదంతో ఎన్నికల నిర్వహణకు తుదినిర్ణయం తీసుకుంటామని పార్థసారథి తెలిపారు.
Surpanch and MPTC Elections postponed in Telangana