పది మంది పౌరులు మృతి
సూకీపై తాజాగా అభియోగాలు
డబ్బు, బంగారం ముడుపుల దుమారం
మాండలే (మయన్మార్) : సైనిక తిరుగుబాటుకు వ్యతిరేక ప్రదర్శనలపై మయన్మార్ భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపాయి. సైనిక పాలకుల ఆదేశాల మేరకు ఇక్కడి నిరసనకారులపై కాల్పులు జరిపారు. గురువారం జరిగిన ఈ కాల్పుల ఘటనలో కనీసం 10 మంది ప్రాణాలు వదిలారు. మయన్మార్లో నిరసనకారులపై దమనీతి చర్యలు నిలిపివేయాలని ఓ వైపు ఐరాస భద్రతా మండలి పిలుపు నిచ్చింది. అయితే దీనిని బేఖాతరు చేస్తూ మయన్మార్ జుంటా అణచివేత చర్యలు చేపట్టింది. మయన్మార్లో హక్కుల నులిమివేత జరుగుతోంది. మానవతను దెబ్బతీస్తూ సాగుతున్న చర్యలకు పలు సాక్షాలు ఉన్నాయంటూ ఐరాస స్వతంత్ర నిపుణులు ఒకరు పేర్కొన్నారు. అయితే ఎటువంటి ప్రతిస్పందనలను పట్టించుకోకుండా అధికార యంత్రాంగం తన పనితాను చేసుకువెళ్లుతోంది. సైనిక తిరుగుబాటును, ప్రజాస్వామ్యయుత సూకీ ప్రభుత్వాన్ని కూల్చివేయడాన్ని ప్రతిఘటిస్తూ సాగిన ఉద్యమకారులపై కాల్పులకు దిగింది. ఈ ఘటనలో పది మంది చనిపోయినట్లు స్వతంత్ర సంస్థలు తెలిపాయి.
మరో వైపు పదవీచ్యుత నాయకురాలు ఆంగ్ సాన్ సూకీపై సరికొత్త అభియోగపత్రాలను దాఖలుచేసింది. 2017 -18లో ఆమె రాజకీయ మిత్రుల ద్వారా 6 లక్షల డాలర్ల ముడుపులు అందుకున్నట్లు, బంగారు కడ్డీలు కూడా తీసుకున్నట్లు ఈ చార్జిషీట్లో తెలిపారు. ఆమెను, ప్రెసిడెంట్ విన్ మియింట్ను ఇప్పటికే ఇతరత్రా అభియోగాలతో సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు సూకీపై అత్యంత తీవ్రమైన ముడుపుల ఆరోపణలు మోపడం ద్వారా ఆమెను మరింతగా రాజకీయంగా, ప్రజాపరంగా అప్రతిష్ట పాలుచేయాలని సైనిక పెద్దలు సంకల్పించినట్లు వెల్లడైంది. సైనిక అధికారిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ జా మిన్ టున్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. యాంగాన్ సంబంధిత నేత ప్యో మిన్ థియిన్ నుంచి సూకీకి బంగారం, అతి పెద్ద మొత్తంలో ధనం అందిందని తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి సాక్షాధారాలను అందించలేదు.