జైపూర్ : సోమవారం మిడతల దండు జైపూర్లోని నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించింది. దాంతో, నగరవాసులు కంగారు పడ్డారు. ప్రస్తుతం పంట పొలాలేమీ లేకపోవడంతో ఆహారం కోసం భారీ వృక్షాలపై వాలుతున్నాయని అధికారులు తెలిపారు. జైపూర్లోని మురళీపురా, విద్యాధరనగర్ ప్రాంతాల్లో కనిపించిన మిడతలు, అక్కడి నుంచి దౌసా జిల్లావైపు పయనిస్తున్నాయి. 18 జిల్లాలకు మిడతలు విస్తరించాయని రాజస్థాన్ వ్యవసాయశాఖ కమిషనర్ ఓంప్రకాశ్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అవి జైపూర్లో కనిపించాయి. మిడతల్ని చెదరగొట్టేందుకు జైపూర్లో కీటక సంహారాలను చల్లించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 11న పాకిస్థాన్ నుంచి రాజస్థాన్లోని గంగానగర్ ప్రాంతంలోకి ప్రవేశించిన మిడతల దండు అక్కడి పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగించాయి. మిడతల నుంచి పంట పొలాలరక్షణకు 200 బృందాలను ఏర్పాటు చేసినట్టు ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ తెలిపింది.