న్యూఢిల్లీ ః ఇప్పుడు కరోనా తీవ్రతకు కేంద్ర బిందువైన తబ్లిగీ జమాత్ గతంలో కూడా వివాదాస్పదం అయింది. ఈ సున్నీ సంస్థకు చెందిన 370 మంది విదేశీ మత కార్యకర్తలపై 201819లో భారతదేశం నిషేధం విధించింది. వీరు అప్పట్లో వీసా ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిర్థారణ అయింది. వివిధ దేశాల నుంచి ఇక్కడికి పర్యాటక వీసా అనుమతులతో వచ్చిన వారు దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టి వచ్చినట్లు, ఈ క్రమంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు గుర్తించారు. అప్పట్లో ఈ సంస్థ వారిని బ్లాక్లిస్టులో ఉంచారు. టూరిస్టు వీసాలపై వచ్చే వారు మత ప్రచారానికి దిగకూడదు, అదే విధంగా మతపరమైన సమావేశాలకు వెళ్లకూడదు, వెళ్లినా ప్రతినిధులుగా పాల్గొనకూడదు, ప్రసంగించకూడదు.
అయితే ఈ నిబంధనలను అన్నింటిని వీరు చాలా కాలంగా ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. మిషినరీ వీసాలపై వచ్చిన వారికే మత ప్రచారానికి వీలుంటుంది. ఇక ఒక్కసారి వీసా ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా నిర్థారణ అయి, బ్లాక్లిస్టులో పెడితే ఇది ఏడేళ్లు అమలులో ఉంటుంది. అయితే ఇటువంటి వాటిని పట్టించుకోకుండా యధావిధిగా టూరిస్టు వీసాలపై వచ్చి వారు మత సభలకు వెళ్లుతున్నట్లు, నిబంధనలకు విరుద్ధంగా దేశంలోని పలు ప్రాంతాలలో మత ప్రధాన స్థావరాలలో బసచేస్తున్నట్లు ఇప్పటి కరోనా వైరస్ కోణంలో మరోసారి వెల్లడైంది.