ఉపమంత్రులను నియమించిన తాలిబన్ సర్కార్
ఇది తాత్కాలిక నిర్ణయమేనంటున్నఅధికార ప్రతినిధి
కాబూల్: అఫ్ఘన్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు మహిళలపై వివక్షను తీవ్రంగా చూపిస్తున్నారు. ఇప్పటికే మహిళలపై అనేక ఆంక్షలు విధించిన తాలిబన్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొన్న మహిళా శాఖను ఎత్తేసినఆపద్ధర్మ ప్రభుత్వం ఇప్పుడు మంత్రివర్గాన్ని విస్తరించగా ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదు. దీన్నిబట్టి 1990 నాటి కాలాన్ని మరోసారి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఈ విషయాన్ని ఆ ప్రభుత్వ అధికార ప్రతినిధి జుబిహుల్లా ముజాహిద్ మంగళవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. ఇటీవల ఆఫ్ఘన్లో ప్రధానితో పాటుగా మంత్రివర్గాన్ని ఎన్నుకున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రివర్గాన్ని విస్తరించింది. ఈ సందర్భంగా ఉపమంత్రులను ఎన్నుకున్నారు. అయితే ఆ ఉపమంత్రుల్లోను, కేబినెట్ మంత్రులోను ఒక్క మహిళ కూడా లేరు. అయితే దీనిపై జబిహుల్లా స్పందిస్తూ ‘ ఇది తాత్కాలిక ప్రభుత్వమే. భవిష్యత్తులో మార్పులుంటాయి’ అని చెప్పారు. మొత్తం మహిళలను ఇంటికే పరిమితం చేయాలని తాలిబన్ పాలకులునిర్ణయించారు.
‘ మహిళలు పిల్లలను కనడానికి మాత్రమే పనికి వస్తారు’ అని ఇటీవల ఓ ప్రతినిధి పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆరో తరగతినుంచి 12వ తరగతి వరకు విద్యార్థినులను తరగతులకు అనుమతించకూడదని కూడా తాలిబన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని కాబూల్ మున్సిపాలిటీలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులను ఇళ్ల వద్దనే ఉండిపోవాలని ఆదివారం హుకుం జారీ చేశారు. ఈ ఆంక్షల గురించి మీడియా ప్రతినిధులు ముజాహిద్ను ప్రశ్నించగా, ఇవి తాత్కాలిక నిర్ణయాలు మాత్రమేనని, బాలికలుపాఠశాలలకు ఎప్పుడు వెళ్తారో త్వరలోనే ప్రకటించడం జరుగుతుందని, దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అయితే అంతకు మించి ఆయన వివరించలేదు.