Saturday, April 20, 2024

ఆదర్శ కవయిత్రి

- Advertisement -
- Advertisement -

ఆర్థిక నేరగాడు గౌతమ్ అదానీ స్పాన్సర్డ్ అవార్డును తమిళ కవయిత్రి సుకీర్తరాణి తిరస్కరించి ఎందరికో ఆదర్శంగా నిలవడం శుభ పరిణామం. ఈ రకంగా ఆమె అవార్డుని స్వీకరించపోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అవార్డులను ప్రకటించగానే స్వీకరించాలనుకునే వారు కోకొల్లలు ఉన్న ఈ రోజు ల్లో ఆమె తాను విశ్వసించిన ఆదర్శాల మేరకు ఆ అవార్డుని తిరస్కరించి భావితరాలకు సరికొత్త సందేశాన్ని అందివ్వడం అభినందనీయం.

ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ నిర్వహించే ‘దేవి అవార్డ్’ కోసం దేశ వ్యాప్తంగా సుకీర్త రాణితో పాటుగా శాస్త్రవేత్త గగన్‌దీప్ కాంగ్, భరత నాట్యం నృత్యకారిణి ప్రియదర్శిని గోవింద్, పరోపకారి రాధికా సంతానకృష్ణ, స్క్వాష్ క్రీడాకారిణి జోష్నా చినప్ప తదితరులు మొత్తంగా 12 మంది మహిళా ప్రముఖులను ఎంపిక చేయగా తమిళ కవయిత్రి సుకీర్త రాణి మాత్రమే అవార్డును తిరస్కరించడం గమనార్హం. ముఖ్యంగా సుకీర్త రాణి దళిత సాహిత్యానికి చేసిన కృషికి ఎంపిక అయ్యారు. ‘నేను మొదట ఈ అవార్డును స్వీకరించడానికి అంగీకరించాను. కాని ముఖ్యంగా ఈ అవార్డు ఈవెంట్‌కు ప్రధాన స్పాన్సర్ అదానీ అని తెలుసుకుని నేను నిర్ఘాంతపోయాను. నేను మాట్లాడే రాజకీయాలు, నమ్మిన సిద్ధాంతాల కోసం అదానీ గ్రూప్‌కి ఆర్థికంగా మద్దతు ఇచ్చే కార్యక్రమంలో అవార్డును స్వీకరించడం నాకు సంతోషంగా లేదు.

కాబట్టి నేను ‘దేవి అవార్డు’ని స్వీకరించడానికి నిరాకరిస్తున్నాను. అయితే నిపుణుల బృందం ఎంపిక తీర్పును మాత్రం గౌరవిస్తాను’ అని పేర్కొనడం ఆమె విధేయత పటిమని సృష్టంగా వెల్లడిస్తుంది. 1973 లో తమిళనాడులోని వేలూరు జిల్లాలోని లాలాపేట్ అనే గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో సుకీర్త రాణి జన్మించారు. ఆ ప్రాంతంలోని పది దళిత కుటుంబాలలో పాటుగా ఆమె ఒకరిగా పెరిగారు. ఆమె చిన్నప్పటి నుండి కుల వివక్ష ఎదుర్కొన్నారు. నేను ఇంటి బయట అడుగు పెట్టగానే కులం ‘కుక్క’లా వెంటాడుతుంది అని ఆమె ఆవేదన చెంది తక్షణమే సామాజిక కార్యాచరణ దిశగా ప్రేరేపింపబడ్డారు. ‘నా జీవితంలో ఒకానొక సమయంలో నా కులం గురించి నేను సిగ్గుపడ్డాను. మా స్కూల్లో టీచర్లు ‘ముందడుగు వేసిన కులానికి చెందిన వారు ఎవరు’, ‘హరిజనులు ఎవరు’ అని అడిగేవారు. కాని ఆ పదాలను నన్ను నేను బహిరంగంగా గుర్తించలేకపోయాను. ఒకానొక సమయంలో కుల గుర్తింపును అధిగమించాను.

ఒక రకంగా నేను దళితురాలిని అయినందుకు గర్వపడ్డాను. చిన్నప్పుడు కులాన్ని అర్థం చేసుకోలేదు. దాన్ని ఎదుర్కొనే పరిపక్వత నాకు లేదు. అప్పుడు తికమకపడ్డాను. ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను’ అని ఆమె తన అంతరంగాన్ని బాహాటంగా వ్యక్తీకరించారు. సుకీర్త రాణి ఎకనామిక్స్, తమిళ సాహిత్యంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆమె వెల్లూరులోని రాణిపేట జిల్లాలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తమిళం బోధిస్తున్నారు. ఆమె చురుకైన స్త్రీవాది, సామాజిక కార్యకర్త. సుకీర్త రాణి తమిళంలో రాసే దళిత స్త్రీవాద కవయిత్రి. ఆమె కవితలు కులం, శరీరం చుట్టూ కేంద్రీకృతం అయ్యాయి. కుల వ్యవస్థ స్త్రీల శారీరక స్వేచ్ఛను ఎలా నిర్బంధిస్తుందో ఆమె తన రచనల ద్వారా బట్టబయలు చేశారు. కైపత్రి యెన్ కనవు కేల్, ఇరవు మిరుగమ్, కామత్తిపూ, తీండపడతా ముత్తం, అవలై మొజిపెయర్తాల్, ఇప్పదిక్కు ఏవల్ మొదలైన ఆరు కవితా సంకలనాలను సుకీర్త రాణి రచించారు. ఆమె తన రచనల ద్వారా మరుగున పడిన అనేక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు.

తేవమగల్ కవితూవి పురస్కారం, పుతుమైపిత్తన్ స్మారక పురస్కారం, పెంగల్ మున్నానిచే మహిళా సాధకుల పురస్కారం మొదలైన పురస్కారాలను సుకీర్త రాణి పొందారు. ముఖ్యంగా సుకీర్త రాణి కవితలు తమిళనాడులోని కళాశాల పాఠ్యాంశాలలో చేర్చబడ్డాయి. 2021 ఆగస్ట్‌లో ఢిల్లీ యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ ఏకపక్షంగా ఇంగ్లీష్ హానర్స్ సిలబస్ నుండి సుకీర్త రాణి రాసిన బామా అలియాస్ ఫౌస్టినా సూసైరాజ్ అనే పాఠ్యంశాన్ని తొలగించడం సర్వత్రా విమర్శలకు గురైంది. ఆమె కవితలు ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, హిందీ, జర్మన్ భాషలలోకి అనువదించబడ్డాయి. కుల గుర్తింపు, స్త్రీ శరీరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, దళిత స్త్రీల సమస్యలు ఇతర కులాల స్త్రీల కంటే భిన్నమైనవి అని సుకీర్త రాణి వ్యక్తిగతంగా భావించారు.

నా రచనలన్నీ నా స్వంత అనుభవాలు కావు అని, అవి స్త్రీల ముఖ్యంగా దళిత స్త్రీ అనుభవాలు అని ఆమె వ్యక్తీకరించడం గమనార్హం. మనమందరం కుల సంకెళ్లలో ఉన్నాం అని, ముఖ్యంగా దళిత స్త్రీల శరీరాలు నిత్య హింసకు గురవుతున్నాయి అని, అగ్రవర్ణ స్త్రీలు అనుభవించే బాధలతో పోలిస్తే, దళిత స్త్రీలు అధ్వాన స్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రస్తుత తరుణంలో ఆమె ప్రధానంగా స్త్రీ విముక్తి గురించి ముఖ్యంగా దళిత మహిళల అభ్యున్నతిపై దృష్టిని కేంద్రీకరించి ఆ దిశగా పురోగమిస్తున్నారు. ‘ఆమె ఆకాంక్షలు సఫలీకృతం కావాలి’ అని కోరుకుందాం. అంతిమంగా ‘నమ్మన ఆదర్శాల ముందు అవార్డులు ఏమాత్రం సరితూగవు’ అని సుకీర్త రాణి నిరూపించారు. ఏది ఏమైననూ ‘నిర్జీవ అవార్డుల కన్నా చరిత్రలో కలకాలం సజీవంగా మనగలిగే ఆదర్శాలు నూతన సమాజ నిర్మాణానికి బాసటగా నిలుస్తాయి’ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

* జె.జె.సి.పి. బాబూరావు, 94933 19690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News