Friday, April 19, 2024

YCP: ఎంఎల్‌సి ఎన్నికలో వైసిపికి షాక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ సాగిన ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ(TDP) అభ్యర్థి పంచుమర్తి అనురాధ(ANURADHA) అనూహ్య విజయం సాధించారు. గెలుపునకు అవసరమైన 23 ఓట్లు ఆమెకు లభించాయి. వైసిపి(YCP) నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంతో అనురాధను విజయం వరించింది. అనురాధ గెలిచి తీరుతారని టిడిపి నేతలు ముందు నుంచే ధీమాగా చెబుతున్నారు. ఇప్పుడు అదే నిజమైంది. 23 ఓట్లతో అనురాధ విజయం సాధించారు.

అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి. కానీ అనురాధకు 23 ఓట్లు పడ్డాయి. క్రాస్ ఓటింగ్‌పై టిడిపి నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అదే నిజమైంది. సాంకేతికంగా టిడిపికి 23 స్థానాలు ఉన్నప్పటికీ.. ఎంఎల్‌ఎలు వల్లభనేని వంశీ (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాళి గిరి (గుంటూరు పశ్చిమ), వాసుపల్లి గణేశ్‌కుమార్ (విశాఖ దక్షిణం) వైఎస్‌ఆర్‌సిపికి ఫిరాయించారు. నలుగురు ఎంఎల్‌ఎలు పార్టీ ఫిరాయించడంతో టిడిపికి 19 సీట్లు మాత్రమే ఉన్నాయి.
ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభం
ఎపిలో గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికలు(MLC Elections) ఉత్కంఠ భరితంగా సాగాయి. అయితే తమకు బలం లేకపోయినా కూడా వైసిపి అభ్యర్థిని బరిలో దింపడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. అలాగే టిడిపి కూడా వ్యూహాత్మకంగా బిసి మహిళను ఈ ఎన్నికల్లో నిలబెట్టింది. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణతో పలువురు వైసిపి ఎంఎల్‌ఎలు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాగా, ఈ ఎన్నికలో పంచుమర్తి అనురాధ అనూహ్యంగా గెలుపొందారు.
ఓటు వేసిన అధికార, ప్రతిపక్ష ఎంఎల్‌ఎలు
ఈ ఎన్నికలో వైసిపి అధినేత, ముఖ్కమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టిడిపి అధి అధినేత చంద్రబాబు నాయుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందమూరి బాలకృష్ణ, టిడిపి, వైసిపి ఎంఎల్‌ఎలు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండపేట ఎంఎల్‌ఎ జోగేశ్వరరావు వీల్ చెయిర్‌లో వచ్చి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వైసిపి నుంచి నాలుగురు ఎంఎల్‌ఎల క్రాస్ ఓటింగ్
ఎంఎల్‌ఎ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో కేవలం 19 మంది ఎంఎల్‌ఎల బలం మాత్రమే ఉన్న టిడిపికి… 23 మంది ఎంఎల్‌ఎల ఓట్లు పడ్డాయి. వైసిపికి చెందిన నలుగురు ఎంఎల్‌ఎల క్రాస్ ఓటింగ్ పడింది. వీరిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓట్లు టిడిపికి పడ్డాయనే విషయంలో ఎలాంటి సందేశం లేదు. టిడిపికి ఓటు వేసిన మరో ఇద్దరు వైసిపి ఎంఎల్‌ఎలు ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. ఊహించని విధంగా అనురాధ ఎంఎల్‌సిగా విజయం సాధించడంతో టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
టిడిపికి కలిసొచ్చిన క్రాస్ ఓటింగ్
ఎంఎల్‌సి ఎన్నికల్లో టిడిపికి క్రాస్ ఓటింగ్ కలిసొచ్చింది. టిడిపి పోటీ చేసే అవకాశం లేదని, ఈ ఏడు సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకుంటామని వైసిపి నాయకత్వం మొదట భావించింది. కానీ ప్రతిపక్షం అనూహ్యంగా విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధను పోటీలో నిలిపింది. వైసిపిలో ఇద్దరు ఎంఎల్‌ఎలు ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్) తిరుగుబాటు చేయడం టిడిపి ఆశలకు ఊపిరి పోసింది. ఇప్పటికే మూడు పట్టభద్ర ఎంఎల్‌సి స్థానాల ఎన్నికల్లో వైసిపి పరాజయం పొందగా, అనురాధ గెలుపు వైసిపిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

వాస్తవానికి శాసనమండలిలో టిడిపి పాతినిధ్యం లేదని అనుకున్న సమయంలో నలుగురు సభ్యుల ప్రాతినిధ్యం పెరిగింది. మరోవైపు క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్థితిని స్వయంగా చూస్తున్న శాసనసభ్యులు కూడా ఇప్పుడు ఎంఎల్‌ఎ కోటా ఎన్నికల్లో టిడిపి వైపు మొగ్గుచూపారన్న చర్చ ప్రారంభమైంది. ఈ విజయం రాజకీయంగా ప్రభుత్వానికి పెద్ద దెబ్బేనని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని వైసిపిలో అంతర్మథనం మొదలైంది. మొత్తం ఏడు ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, శాసనసభలో తమ పార్టీకి ఉన్న బలాన్ని బట్టి టిడిపి ఒక అభ్యర్థిని మాత్రమే పోటీకి నిలబెట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News