సెయింట్ ఆగస్టీన్ స్కూల్లో ఘటన
మన తెలంగాణ / ముషీరాబాద్ : నాలుగో తరగతి చదివే విద్యార్థి అల్లరి చేస్తున్నాడన్న నెపంతో టీచర్ చితకబాదిన సంఘటన నల్లకుంటలో చోటుచేసుకుంది. నల్లకుంటలోని సెయింట్ ఆగస్టీన్ హైస్కూల్లో 4వ తరగతి చదువుతున్న ఎన్. సాయి ప్రణీత్ అనే విద్యార్థిని హోం వర్క్ సరిగ్గా చేయడం లేదని, అల్లరి చేస్తున్నాడన్న నెపంతో తీవ్రంగా క్లాస్ టీచర్ తీవ్రంగా కొట్టింది. ఈ ఘటన ఈనెల 11న జరిగింది. క్లాస్ రూమ్లో ప్లాస్టిక్ స్కేల్తో, విద్యార్థి చేయి, వీపు భాగంలో కొట్టింది. దీంతో విద్యార్థి చర్మం బొబ్బలు ఎక్కింది. సాయి ప్రణీత్ నొప్పితో విలవిల్లాడుతున్నా పట్టించుకోని ఆ టీచర్ రాక్షసంగా అరగంట పాటు కొట్టిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. తమకు ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని నల్లకుంట ఇన్స్పెక్టర్ మురళీధర్ తెలిపారు.