Friday, March 29, 2024

త్వరలో టీచర్ల భర్తీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గజ్వేల్: ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి త్వర లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. టీచర్ల రిక్రూట్‌మెంట్‌పై సిఎం కెసిఆర్ సానుకూలంగా ఉన్నారన్నారు. త్వరలో టీచర్ల ఖాళీలను భర్తీ చేస్తామని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మహంతి ఆడిటోరియంలో ఎంఎల్‌సి కూర రఘోత్తమరెడ్డి అధ్యక్షతన ఆదివా రం జరిగిన పిఆర్‌టియూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు హరీశ్ హాజరై మాట్లాడా రు. రాష్ట్రంలో విద్యారంగాన్ని పట్టించుకోవడంలేదని కొందరు కూహనా మేధావులు అబద్ధపు ప్ర చారాలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని పి లుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యారంగంతో పాటు ఇతర రంగాల్లో కూడా జరిగిన, జరుగుతున్న అభివృద్ధిపై మేధావి వర్గాల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్య వచ్చినా ఇప్పటి వరకు టిఆర్‌ఎస్ ప్రభుత్వమే పరిష్కరించిందన్నారు. కేం ద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న ఇబ్బందుల వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సిఎం కెసిఆర్ అందర్నీ కడుపులో పెట్టుకుని కాపాడుకునే నాయకుడని, ఎవరికీ ఏ కష్టం రాకుండా చూసుకుంటాడని మంత్రి అన్నారు. ఉద్యోగుల విషయంలో టిఆర్‌ఎస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. త్వరలో ఎంప్లాయిస్ హెల్త్ కార్డు విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే నిజాలు మన కళ్లముందే ఉంటాయన్నారు. రాష్ట్రంలో ప్రతి రంగంలో జరిగిన అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. మంచిని చెడును విశ్లేషించిన నాయకత్వం కలిగిన ఉపాధ్యాయులు సమాజానికి నిజాన్ని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేయాలన్నారు.

భూమికి బరువైన పంట దిగుబడులు.. కొనలేక చేతులెత్తేసిన కేంద్రం

వ్యవసాయ రంగంలో ఊహించలేనంత అభివృద్ధి జరిగిందని, భూమికి బరువైన పంట పండుతుంటే ఒక ఎకరానికి కూడా కాళేశ్వరం నీళ్లు ఇవ్వలేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అర్థం లేదన్నారు. కాళేశ్వరం నీళ్లు రాకుండానే తెలంగాణలో పండిన పంట కొనలేనంత బరువు కేంద్రానికి ఎందుకైందో ప్రతిపక్షాలు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. 2014 నాటికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కోటి 34 లక్షల ఎకరాలు కాగా ఈ నాటికి 2 కోట్ల 3లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. ఇది కాకుండా 11.50 లక్షల ఎకరాలు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం కూడా పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ బావుల కాడ మీటర్లు పెట్టలేదని ఈ సంవత్సరం రూ.6 వేల కోట్లు ఆపిందని, ఎఫ్‌ఆర్‌బిఎం నిధుల కింద మరో రూ15వేల కోట్లు నిలిపి వేసిందని, ఇలా మొత్తంగా రూ.21వేల కోట్ల నిధులు కేంద్రం నుంచి మనకు రావాల్సి ఉందన్నారు.

జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా ముందుకు..

ప్రస్తుతం జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఇప్పటి వరకు 12 మెడికల్ కాలేజీలను ప్రారంభించామన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. వైద్య రంగంలో ఎంబిబిఎస్, నర్సింగ్, బీఫార్మసీ, ఎం ఫార్మసీ, దంత వైద్యం ఇలా అనేక కోర్సులతో ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రం వచ్చిన నాడు ఎంబిబిఎస్ సీట్లు 850 మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 2950కి పెరిగాయన్నారు. సిఎం కెసిఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉస్మానియా గాంధీ కాకుండా.. 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో 295 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండగా.. ఇప్పుడు 920కి పెరిగాయని, 4.46లక్షల మంది పిల్లలకు బోధన అందిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర బడ్జెట్‌లో పది శాతం కేవలం విద్యపై ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మన ఊరు – మన బడి ద్వారా అన్ని పాఠశాలలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. జిఎస్‌డిపి 2014లో రూ.1,24,000 ఉండగా.. ఈ సంవత్సరం రూ.2,75,000 పెరిగిందన్నారు. దేశ జిడిపి ఇప్పటికీ తెలంగాణ కంటే తక్కువనేన్నారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాపరెడ్డి, పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ , ఎఎంసి చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాజమౌళి గుప్తా, సిద్దిపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శశిధర్ శర్మ, పంతం వెంకట్రాజం, 33 జిల్లాల నుంచి కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News