Thursday, April 25, 2024

రేపటి నుంచి టీచర్ల బదిలీలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో శుక్రవారం నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం జిఒ నెం.5ను జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా పదోన్నతులు జరగనున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగునంగా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 27వ తేదీన కేటగిరీలవారీగా ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు. 28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు.

దరఖాస్తుల హార్డ్ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎంఇఒలకు.. మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు.. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డిఇఒకు.. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2లోపు సమర్పించాలి. మార్చి 4వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 5 నుంచి 19 వరకు అప్పీళ్లను స్వీకరించి పరిష్కరిస్తారు. బదిలీలన్నీ వెబ్ కౌన్సెలింగ్ విధానంలోనే ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఐదేళ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులను, మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న టీచర్లను దరఖాస్తు చేసుకోకపోయినా బదిలీ చేయనున్నట్టు జిఒలో వెల్లడించారు.

బాలికల పాఠశాలల్లో 50 ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులుంటే బదిలీ చేసి.. మహిళలను నియమిస్తారు. ఒక వేళ మహిళా ఉపాధ్యాయులు లేకపోతే 50 ఏళ్లు దాటిన పురుషులను నియమిస్తారు. ఉపాధ్యాయులకు డిఇఒ, ప్రధానోపాధ్యాయులకు ఆర్‌జెడి బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. మొత్తం 37 రోజుల్లో టీచర్లు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో 3 సంవత్సరాల లోపు రిటైర్ అయ్యేవారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారు కోరుకుంటే తప్ప బదిలీ చేయరు. బదిలీలకి ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించారు.

ఉపాధ్యాయుల బదిలీలు,- పదోన్నతుల షెడ్యూల్

జనవరి 27 నుండి ప్రక్రియ ప్రారంభం
జనవరి 27న గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాల ప్రకటన
జనవరి 28 నుండి 30 వరకు బదిలీలకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
ఫిబ్రవరి 7న డిఇఒ/ ఆర్‌జెడి వెబ్‌సైట్లలో బదిలీ పాయింట్లతో ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాలు,పదోన్నతుల సీనియారిటీ జాబితాల ప్రకటన
ఫిబ్రవరి 8 నుండి 10 వరకు మూడు రోజులు అభ్యంతరాల స్వీకరణ పరిశీలన, పరిష్కారం.
ఫిబ్రవరి 11,12 తేదీలలో తుది సీనియారిటీ జాబితాల ప్రకటన, ప్రధానోపాధ్యాయులు బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు
ఫిబ్రవరి 13న మల్టీ జోనల్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునః పరిశీలన
ఫిబ్రవరి 14న ఆర్‌జెడిలచే ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల విడుదల
ఫిబ్రవరి 15న బదిలీల అనంతరం మిగిలిన ఖాళీల ప్రకటన.
ఫిబ్రవరి 16,17,18 తేదీల్లో అర్హత గలిగిన స్కూల్ అసిస్టెంట్స్‌కు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సెలింగ్.
ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సబ్జెక్టుల వారీగా స్కూల్ అసిస్టెంట్స్ ఖాళీల ప్రకటన,బదిలీ ఆప్షన్స్ నమోదు.
ఫిబ్రవరి 21 న ఆప్షన్ల సవరణ, పనఃపరిశీలనకు అవకాశం
ఫిబ్రవరి 22,23 తేదీల్లో డిఇఒలచే స్కూల్ అసిస్టెంట్స్ బదిలీ ఉత్తర్వులు విడుదల.
ఫిబ్రవరి 24 న స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ప్రకటన
ఫిబ్రవరి 25,26,27 తేదీల్లో ఎస్‌జిటి తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు మాన్యువల్ కౌన్సెలింగ్ విధానంలో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు.
ఫిబ్రవరి 28, మార్చి 1,2 తేదీల్లో ఎస్‌జిటి తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన, వెబ్ ఆప్షన్స్ నమోదు.
మార్చి 3న ఆప్షన్ల సవరణ, పునః పరిశీలన
మార్చి 4న ఎస్‌జిటి తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల.
మార్చి 5 నుండి 19 వరకు డిఇఒ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీల్స్, అభ్యంతరాలను ఆర్‌జెడికి, ఆర్‌జెడి ఉత్తర్వులపై అప్పీల్స్/ అభ్యంతరాలను డిఎస్‌ఇకి పంపించుకోవాలి. సంబంధిత అధికారులు 15 రోజుల్లో వాటిని పరిష్కరించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News