Friday, March 29, 2024

వైద్యసేవల్లో దేశంలో మూడో స్థానం

- Advertisement -
- Advertisement -

Telangana-logo

హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. గత ఆరేళ్ల కాలంలో సుమారు రూ.40409 కోట్లు ఖర్చు పెట్టి సర్కార్ దవాఖానలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా ప్రక్షళన చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ-వైద్య సౌకర్యాల కల్పనకు ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలు మెరుగైన ఫలితాలను సాధించాయి. ఈ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలతో పాటు మాతా, శిశు మరణాలను తగ్గింపులో గణనీయమైన ప్రగతి సాధ్యమైంది.

కెసిఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ఆరోగ్య తెలంగాణ సాధనకై అహరహం శ్రమిస్తున్నది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఉద్దేశ్యంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేద ప్రజలు వైద్యం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. సిఎం కెసిఆర్ ప్రత్యేక వ్యూహాలతో “ నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకి అనే దగ్గరి నుంచి నేను వస్తా” అనే తీరులో ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దారు.

భయం పోయి భరోసా నింపే విధంగా గవర్నమెంట్ ఆసుపత్రులు మార్పు చెందాయి. పిహెచ్‌సిలు నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు మెరుగైన సౌకర్యాలను కల్పించి నాణ్యమైన వైద్యం అందించేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా చికిత్సను అందిస్తూ ఎంతో మంది పేదలకు సర్కార్ దవాఖానలు ఆసరగా నిలస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో కల్పిస్తున్న సౌకర్యాలతో గతం కంటే సర్కారు ఆస్పత్రుల్లో ఓపీ శాతం 30 నుంచి 40 శాతానికి పెరిగింది. అదే విధంగా మందుల కొనుగోళ్లకు గతంలో రూ.150 కోట్లు బడ్జెట్ ఉండగా ప్రస్తుతం దాన్ని రూ.400 కోట్లకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం పెంచింది.

అత్యవసర ఆరోగ్య సౌకర్యాలు
1.ఐసియూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)

క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వం పది పడకలు కలిగిన 20 ఐసియులను(ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లను) ఏర్పాటు చేసింది. 25 జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో ఐసియు సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు భద్రతనిస్తున్నది.

2.(సిక్ న్యూ బార్న్ కేర్ యూనిట్)

నవజాత శిశులకు అత్యవసర సేవలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది. పూర్వం 18 మాత్రమే ఉన్న ఎస్‌ఎన్ సియుల సంఖ్యను 42 కు పెంచి పసి పిల్లల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని చాటుకున్నది.

3.(మెటర్నల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)

గర్బిణీలు, బాలింతలకు అత్యవసర సేవలు అందించడానికి రాష్ట్రంలోనే మొదటిసారిగా మేటర్నల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు(ఎంఐసియు)ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ యూనిట్లు ద్వారా ఎంతో మంది తల్లులు ప్రత్యేక సేవలను పొందారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కెసిఆర్ కిట్ సూపర్ హిట్ అయ్యింది. గర్భిణులకు వైద్య ఖర్చులు లేకుండా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు పెంచే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

ప్రభుత్వాస్పత్రుల్లో పురుడుపోసుకుంటే మగబిడ్డ పుట్టినవారికి రూ.12వేలు, ఆడబిడ్డ పుట్టిన వారికి రూ.13వేల నగదును ప్రభుత్వం అందజేస్తోంది. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు 30 నుంచి 55 శాతానికి పెరిగాయి.దీంతో శిశుమరణాల శాతం కూడా తగ్గింది. ఐదేళ్ల క్రితం ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 39 మరణాలు ఉంటే అది 27కు తగ్గింది. అదే విధంగా రాష్ట్రంలో బాలింతల మరణాలు ప్రతి లక్ష మందికి 92గా ఉంటే ఇప్పుడది 70కి తగ్గింది. గతంలో తెలంగాణ ప్రాంతంలో ఇమ్యూనైజేషన్ శాతం 68 ఉండగా అదిప్పుడు 92 శాతానికి చేరుకుంది.

జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్ హబ్స్ ఏర్పాటు

ఇప్పటి వరకు రాష్ట్రంలో 40 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు, 40 డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వ్యాధుల నిర్ధారణకు పైసలు పెట్టుకోలేని నిరుపేదలకు ఉచితంగా 58 రకాల పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం ప్రతి జిల్లా కేంద్ర దవాఖానలో డయాగ్నస్టిక్ హబ్ లను నెలకొల్పేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో మోడల్ హబ్‌ను ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ హబ్‌లో రక్త, మల, మూత్ర పరీక్షలు, టైఫాయిడ్, డెంగీ, మలేరియా జ్వరాల నిర్ధారణ, కాలేయం, మూత్రపిండాలు, థైరాయిడ్ పనితీరు పరీక్షలు, కొలెస్ట్రాల్, షుగర్ వంటివాటితోపాటు మొత్తం 58 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు.

కంటివెలుగు

రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకుండా అంధత్వ రహిత తెలంగాణ సాధన దిశగా ‘కంటి వెలుగు’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా నేత్ర శిబిరాలను నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 1.54 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు.

104 వాహనాలు…..

గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వైద్య సేవలందించేందుకుగాను ప్రభుత్వం 104 వైద్యసేవలను కొనసాగిస్తున్నది. ప్రతి నెలా నిర్దేశించిన గ్రామాల్లో ఇవి సేవలందిస్తూ వస్తున్నాయి. చిన్నచిన్న రుగ్మతలతో బాధపడే వృద్ధులు, మహిళలకు వైద్యసేవలతో పాటు నెలకు సరిపడా మందులను వీటి ద్వారా అందిస్తున్నారు.

Telangana at third place in country medical services

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News