మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ సిఎం కార్యాలయంలో కూడా కరోనా కలకలం రేపింది. మెట్రో రైల్ భవన్లో పనిచేస్తున్న సిఎంఒ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవలే మహారాష్ట్ర నుంచి ఆ ఉద్యోగి కుమారుడు హైదరాబాద్కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కుమారుడి ద్వారా సిఎంఒ ఉద్యోగికి వైరస్ సోకిందని గుర్తించడం జరిగింది.
దీంతో సిఎంఒ కార్యాలయానికి ఎవరూ రావొద్దని అన్ని శాఖల అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొద్దిరోజుల పాటు సిఎంఒ కార్యాలయం బంద్ కానుంది. ఇప్పటి వరకూ మొత్తం 30 మంది సిబ్బంది శాంపిళ్లను చెస్ట్ ఆసుపత్రి వైద్య సిబ్బంది సేకరించింది. కాగా సిఎంఒలో పని చేస్తున్న వారిలో సీనియర్ సిటిజన్స్ అధికంగా ఉన్నారు. ఈ పరిణామాలతో సిఎంఒలో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు సిఎంఒ కార్యాలయం మొత్తం సిబ్బంది శానిటైజేషన్ చేస్తోంది. ఈ క్రమంలో పొల్యూషన్ బోర్డు కార్యాలయం నుంచి ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ విధులు నిర్వహిస్తున్నారు.
Telangana CMO Office Closed due to Corona